నీలతోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా. అందుకే నల్లని మేఘమండలం మధ్యలో పచ్చగా వెలిగే మెరుపు తీగలాగా వెలిగి పోతున్నదట ఆ సుషుమ్న. మేఘంలాగా చీకట్లు కమ్మే ఈ జడ శరీర మార్గంలో ఒక మెరుపు మెరిసినట్టు మెరుస్తున్నదది. నీవార శూకవత్తన్వీ ఎంత సున్నితంగా ఉందంటే అది నీవార శూకవత్ నివ్వరి గింజ ముల్లులాగా అతి నిశితంగా ఉంది. అణూపమా. అణువులాగా అతి సూక్ష్మంగా ఉంది. పీతా భాస్వతీ. పచ్చగా బంగారంలాగా ప్రకాశిస్తున్నది. అంటే అతి సూక్ష్మమూ ప్రకాశమానమూ అయితే గాని అది బుద్ధిని స్పందింప జేసి అతి సూక్ష్మమైన బ్రహ్మాకార వృత్తిగా మారలేదు. దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః అని గదా కఠోపనిషత్తు చెప్పిన మాట. సర్వత్రా వస్తు సిద్ధంగా ఉన్నా గూఢమయి ఉందట ఆత్మ స్వరూపం. మామూలు బుద్ధి కది కనిపించే బాపతు కాదు. దానిలాగా ఇదీ సూక్ష్మమూ అగ్రమూ అయి పదును చెందితే గాని పట్టుకో లేదు.
తస్యాశ్శిఖా యా మధ్యే - పరమాత్మా వ్యవస్థితః
అలా పట్టుకోవాలంటే దాని శిఖ అంటే అగ్రం బాగా మొనదేరి ఉండాలి. అందులోనూ మధ్యే. ఏ ఖాళీ ఉన్నదో అది నిరాకారం నిర్గుణం. పరమాత్మా వ్యవస్థితః. అందులో కూచుని ఉన్నాడా పరమాత్మ. అంటే శుద్ధమైన చైతన్యం. సర్వవ్యాపకం గనుక అక్కడ ఉండటంలో ఆశ్చర్యం లేదు.
Page 162