హృదయం నుంచి ఇప్పుడు మన దృష్టి బుద్ధి దగ్గరికి బదిలీ అయి పోయింది. హృదయ మచేతనమైతే బుద్ధి చేతనం. అక్కడ జ్ఞానం లేదు. లేదంటే అసలు లేదని గాదు. అసలే లేకుంటే ఏదీ మనకున్నట్టు స్ఫురించదు. ఆత్మ అన్నప్పుడది సర్వత్రా ఉండి తీరాలి. అయితే జడ పదార్ధాలలో అది సద్రూపంగా వ్యక్తమయి చిద్రూపంగా గుప్తమయి ఉంటుంది. అదే చేతనాలలో అయితే చిద్రూపంగా ప్రకటమై సద్రూపంగా పరిమిత మయి ఉంటుంది. అదే ఇప్పుడు మనబోటి జీవుల పరిస్థితి. మన బుద్ధి జ్ఞాన స్వరూపమే. కాని అది చిద్రూపమైనా సద్రూపంగా దానికి వ్యాప్తి లేదు. శరీరం మేరకే పరిమితమయి పోయింది. ఇదే వ్యాపించిందను కోండి. అప్పుడు దేశ కాల పాత్రలనే అవధులు కనిపించవు. వాటిని కూడా వ్యాపించి తనలో కలుపు కొంటుంది. కలుపుకొంటే అప్పుడది ఇక జీవాత్మ గాదు. పరమాత్మే. అలాటి పరమాత్మ భావాన్ని అందుకోటానికే ఇప్పుడీ ఉత్తరార్థంలో మంత్ర పుష్పం మనకు చేసే ఉపదేశమంతా. అది అందుకొనే ప్రయత్నమే మనం చేయవలసిన దంతా.
ఇంతకూ ఈ సుషుమ్న అనేది హృదయాన్నీ బుద్ధినీ రెండు తీరాలనూ కలిపే ఒక వంతెన. వంతెన లాంటి ఈ బృహత్సిర రెంటినీ కలపటం వల్ల రక్తం మెదడు దాకా ప్రవహించి బుద్ధి పనిచేస్తున్నది. అందులో అనేకానేక వృత్తు లేర్పడుతున్నాయి.
Page 159