ఒకటి ఉందో లేదో సంభవమో అసంభవమో నిర్ణయించ వలసింది మొదట మానవుడి బుద్ధే. అది ఉందని నిర్ధారణ చేస్తే తరువాత తదాకారమైన ఆలోచనతో దాన్ని పట్టుకొని ఉంటుంది బుద్ధి. ఘటమనే ఆలోచనతోనే గదా ఘటమొకటి ఉందని దాన్ని గ్రహిస్తున్నాము. ఇది సుఖమనే జ్ఞానంతోనే గదా సుఖాన్ని అనుభవిస్తున్నాము. జ్ఞానమే లేకపోతే ఇది ఘటమని ఇది సుఖమనీ నీ అనుభవాని కెలా వచ్చింది.
అలాగే ప్రస్తుత మిది అఖండమైన ఆత్మ స్వరూపమిది తప్ప మరేమీ లేదనే భావం నీకెలా కలిగింది. దానికి సంబంధించిన ప్రమాణం నీ మనసులో ఏర్పడితే గదా. అది ఎలా ఏర్పడుతుంది. ఆత్మ స్వరూపమనేది ఏమిటో అది ఎలా ఉంటుందో వర్ణించినప్పుడు. అందుకే పూర్వార్ధమంతా దాన్ని చిలువలు పలువలు పెట్టి వర్ణిస్తూ వచ్చింది. సహస్ర శీర్షమని ప్రారంభించి సముద్రేంతం వరకూ దాని వర్ణనే. అది కూడా కేవలం నిర్గుణంగా గాక సగుణ నిర్గుణ రూపంగా సాగింది వర్ణన. అలాంటప్పుడే దాని స్వరూపమూ విభూతీ రెండూ మనసుకు వస్తాయి. లేకుంటే కేవలం నిరాకారమైన జ్ఞానమే నేమో అది సాకారమైన మన చుట్టూ కనిపించే ఈ ప్రపంచం కాదేమో ననే భ్రాంతికి లోనవుతాము. అలాకాక సాకారమేమిటి నిరాకారమేమిటి రెండూ అదే ననేసరికి మనమూ మనం చూచేదీ అంతా మన స్వరూపమే ననే అఖండా ద్వైతాత్మ స్వరూపాన్ని పట్టుకోగలం. అదే బయట పెట్టింది పూర్వభాగం.
Page 147