అలాటి మంత్రం ద్వారా మనస్సును సర్వవ్యాపకమైన బ్రహ్మ చైతన్యాని కర్పణ చేయటమే మంత్ర పుష్పమనే మాటలో ఇమిడి ఉన్న ఆంతర్యం. కాబట్టి మనమిప్పుడా అంతరార్ధాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మంత్ర పుష్పాన్ని వ్యాఖ్యానించ వలసి ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. మొదటిది సహస్ర శీర్షమనే దానితో ప్రారంభమయి సముద్రేంతం విశ్వశంభువం వరకూ సాగే పూర్వార్థం. రెండవది పద్మకోశ ప్రతీకాశ మనే వాక్యం మొదలుకొని చివరిదాకా సాగే ఉత్తరార్థం. ఇందులో పూర్వార్థం మనం చేరవలసిన గమ్యాన్ని వర్ణిస్తే ఉత్తరార్థం దాన్ని చేర్చే గమకం లేదా సాధన మార్గాన్ని వర్ణించి చెబుతుంది. కేవలం గమ్యాన్ని వర్ణించి కూచుంటే ప్రయోజనం లేదు. సాధనం లేకుండా దాన్ని అందుకోలేము. అలాగే కేవలం గమకమైన సాధన మార్గాన్ని చెప్పి సుఖం లేదు. గమ్యమేదో తెలియకపోతే ఇది చీకటింట్లో తడుముకోటం లాగా ఫలితమివ్వదు. కాబట్టి రెండింటినీ నిరూపించాలి మంత్రం. అలాగే నిరూపిస్తున్నదీ మంత్ర పుష్పం. అందులో మొదట మన ప్రయాణానికేది గమ్యమో అది బయటపెడుతున్నది. వినండి.
Page 123