కాని తదవిస్మరణార్ధ మన్నారు శంకర భగవత్పాదులు. మరచి పోకుండా దాన్ని నిత్యమూ జపిస్తూ మనసా దాని అర్థాన్ని స్మరిస్తూ పోవాలి. న్యాయమైతే సర్వకాల సర్వావస్థలలోనూ అదే ధ్యాస ఉండాలి మనస్సులో. కాని అలా చేయటం ప్రాపంచిక వ్యవహారాలలో తగులుకొన్న ఈ మానవుడి బుద్ధికి సాధ్యం కాదు. కాబట్టి కనీసం త్రిసంధ్యలలోనైనా దాన్ని స్మరించటం వీడి బాధ్యత. అప్పుడు కూడా యధాశక్తిగా అష్టోత్తర శతం గాని సహస్రంగాని జపం చేయటమని వార్యమని ప్రస్తుతం గాయత్రీ మంత్ర జపాన్ని విధిస్తున్నది శాస్త్రం. అది కూడా ఊరక నోటితో ఉచ్చరించటం వరకే గాదు. మనసా దాని అధి దేవతను ధ్యానిస్తూ బాహ్యంగా అంగన్యాస కరన్యాసాలు పాటిస్తూ ఆచరించాలి. న్యాసమంటే ఉంచటం. కరన్యాసమంటే చేతుల మీద ఉంచటం. అంటే ఆ మహాశక్తి మన వేళ్లమీద వచ్చి కూచున్నట్టు భావించటం. అలా భావిస్తే మనరెండు చేతులూ పవిత్రమవుతాయి. ఏదైనా చేతులతోనే గదా ఆచరిస్తాము. అది పవిత్రమైతే వాటితో చేసే కర్మా పవిత్ర మవుతుంది. అలాగే అంగన్యాసమంటే మొత్తం శరీరం మీద తెచ్చి పెట్టటం. అప్పుడు ఆపాదమస్తక మీ శరీరం కూడా పావన మవుతుంది. ఉపాధి ఎప్పుడు శక్తి చేత పవిత్రమూ శక్తిమంతమూ అయిందో దానితో నిర్వర్తించే కర్మ కూడా కోరిన ఫలాన్ని అందివ్వటానికి సమర్ధమవుతుందని తాత్పర్యం.
Page 78