మరి అలాంటప్పుడీ సూర్యోపస్థాన మేమిటి. ఎవడీ ఆదిత్యుడు. ఎవడో కాదు. దానికొక ఉపాధి. పరోక్షంగా ఉన్నదని భావించే బ్రహ్మమే అపరోక్షంగా ఆదిత్య రూపంతో దర్శనమిస్తున్నది మనకు. అంచేత దీన్ని కేవలమొక భౌతికమైన మండలంగా చూడక తద్రూపంగా ఉన్నదక్కడ సచ్చిద్రూపమైన పరమాత్మే అని దర్శించాలి సాధకుడు. ఇదీ తాత్పర్యం.
పోతే ఇక గాయత్రి నావాహన చేయాలి మనం. గాయత్రీ అంటే పరమాత్మ శక్తేనని పేర్కొన్నాము. అది పరమాత్మ లాగా సర్వవ్యాపకమైనా అజ్ఞానవశాత్తూ మనకు దూరంగా భావిస్తున్నాము. కాబట్టి మనమీది కావహించుకోవాలి. అప్పుడది శబ్ద రూపంగా దిగి వస్తుంది. గానం చేస్తూ అవతరిస్తుంది కాబట్టి గాయత్రి అన్నారు దాన్ని. మరలా దాన్ని శబ్ద రూపంగా జపిస్తూ పోతే జాపకుణ్ణి భోగా పవర్గా లిచ్చి రక్షిస్తుంది. కాబట్టి కూడా గాయత్రీ అన్నారు. ఏమిటీ గాయత్రి అంటే. శాబ్దికంగా చెబితే ఓం కారమే అది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓమ్మనేది ఏకాక్షరం. అది సాక్షాత్తూ బ్రహ్మమే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్నని గీతా వాక్యం. శబ్ద రూపంగా ఓమ్మని జపిస్తున్నావంటే అర్థరూపంగా బ్రహ్మమే నీ మనస్సులో ఉండాలి. శబ్దమొక వ్యాహృతి మాత్రమే. అంటే ముఖతః ఉచ్ఛరించటమే. దాని అర్థం పరమాత్మ. తజ్జప స్తదర్ధ భావనమని అందుకే అన్నాడు పతంజలి. అంటే వచసా జపం. మనసా ధ్యానం. అగ్నిర్దేవతా.
Page 67