అలా సమర్పించేటపుడు మూడుసార్లు ఓం భూర్భువ స్సువః అని గాయత్రీ మంత్రాన్ని జపించి చేతిలో పోసుకున్న జలాన్ని సూర్యమండలం వైపు చూపి పాత్రలో విడిచి పెట్టాలి. ఇందులో సంధ్యాకాల మతిక్రమిస్తే ముఖ్య కాలా తిక్రమణ దోష పరిహారార్ధమని కూడా ఒక మాట అనాలి నోట. మధ్యాహ్న సంధ్యా వందనంలో అయితే మరొక మంత్రం కూడా ఉంది. అది ముందు చెప్పుకొని తరువాత గాయత్రిని జపించవలసి ఉంటుంది. అదేమిటంటే.
హగ్ంస శ్శుచిష ద్వసు రంత రిక్షస - ద్ధోతావేదిష - దతిథి ర్దురోణ సత్ - నృష ద్వరస దృతస ద్వ్యోమస - దబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ -
ఇక్కడ సూర్యుడని పేరే గాని తద్వారా పరమాత్మ స్వరూపాన్నే ధ్యానం చేస్తున్నాడు సాధకుడు. పరమాత్మకీ మండల మొక ఉపాధి. సూర్య ప్రకాశమనే నెపంతో భూమ్యాకాశాలన్నీ వ్యాపించి ఉన్నది నిజాని కా పరమాత్మ చైతన్య ప్రకాశమే. హగంసః హంతీతి హంసః సర్వత్రా వ్యాపించేది సూర్యుడా. కాదు. పరమాత్మ అనే సూర్యుడు. అది శుచిషద్ శుద్ధమైన ఆకాశంలో ఉంది. వసు - భూమి మీదా ఉంది. అంతరిక్ష సద్ రెండింటి నడుమా అంతరిక్షంలో ఉంది. హోతా వేదిషద్ అగ్నిరూపంగా యజ్ఞ వేదికలో ఉంది. అందులో హోమం చేసే హోత కూడా అదే. అతి ధి ర్దురోణసద్. దురోణమంటే ద్రోణం. అంటే గృహం.
Page 64