మాయాశక్తి అని అర్థం. దానికి కూడా అతీతమైన తత్త్వమొకటి ఉన్నది. అవ్యక్తా త్పురుషః పరః అన్నారు. ఏదో గాదది. పరిపూర్ణమైన బ్రహ్మ చైతన్యం.
చూచారా. మరలా పైకి తీసుకెళ్లుతున్నది గాయత్రి మనలను. మనసు దగ్గరి నుంచి నీవు ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ పోతే నిన్ను ఆ బ్రహ్మ తత్త్వాన్నే చేరుస్తానని మనకు హామీ ఇస్తున్నది. ఆ హామీయే భూర్భువస్సువరోమని మళ్లీ పలకటం. ఈ మూడు వ్యాహృతులూ ఇంతకు ముందూ వచ్చాయి. ఇప్పుడూ వస్తున్నాయి. అప్పుడవ రోహణ క్రమంలో చెప్పాము వీటి కర్థం. ఇప్పుడారోహణ క్రమంలో చెప్పుకోవలసి ఉంది. ఎందుకంటే అది ఆ దివ్య చైతన్యం సంసారాభి ముఖంగా క్రిందికి చేసిన ప్రయాణమైతే ఇప్పుడిది సాయుజ్యాభి ముఖంగా సాధకుడు పైకి చేయవలసినది. ఎలాగ. భూర్భువస్సువః అంటే తేజోబన్న తత్త్వాలని పేర్కొన్నాము. భూః అంటే అన్నమిక్కడ. అన్నమెందుకు భుజిస్తున్నాం. భువః మనస్సు పని చేయటానికి ఆలోచనలు రావటానికి. ఆలోచనల వరకైతే అది ప్రాపంచికంగా వెళ్లిపోవచ్చు. కాబట్టి సువః తేజోరూపమైన వృత్తి ఏదో దాన్ని పట్టుకో. వరేణ్యం భర్గః అది బ్రహ్మాకారమైన వృత్తి. అది క్రమంగా నీ మనస్సును మహర్జన స్తపస్సులనే మూడు భూమికలనూ దాటించి చివరకు సత్య స్వరూపమైన పరమాత్మతో నీకు సాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది. ఓం కారంతో ప్రారంభమయి గాయత్రి ఇప్పుడోంకారంతో సమాప్తమయింది.
Page 33