పరమాత్మే దాని స్వరూపమట. జీవ బ్రహ్మైక్యమే దాని ప్రయోజనమట. ఇంతకన్నా ఏమి కావాలి మనకు ప్రమాణం. ఏ మంత్రానికీ చెప్పలేదివి రెండూ. ఒక్క గాయత్రికే చెప్పారు. కనుకనే న గాయత్ర్యాః పరో మంత్రో నమాతుః పర దైవతమని వాక్రుచ్చారు పెద్దలు. ఇదుగో గాయత్రీ ముఖమూ గాయత్రీ గర్భమే గాక గాయత్రి శిరస్సు కూడా ఇప్పుడీ పరమార్థాన్నే మనకు వెల్లడిస్తున్నది. గాయత్రి మంత్రమైతే దానికి పూర్వ రంగం భూర్భువ స్సువరాది వ్యాహృతులు. అది దాని ముఖం - పోతే తత్సవితు ర్వరేణ్యమని పేర్కొన్నది దాని గర్భం. ఇక మూడవది దాని శిరస్సు. అదే ఇప్పుడు చెప్పబోతున్నాడు మహర్షి ఏమిటది. ఓ మాపో జ్యోతీ రసో మృతం బ్రహ్మ - భూర్భువస్సువ రోమ్. ఇది మంత్ర జపం ద్వారా సాధకుడైన వాడు ఆ బ్రహ్మైక్యమనే ఫలాన్ని సాధించే మార్గమేదో దాన్ని సూచిస్తుంది. ఆపః అంటే పంచభూతాలు. అంటే పాంచభౌతికమైన తత్త్వమే మన శరీరంగా మారి కనిపిస్తున్నది గనుక ఈ శరీరమే ఆపస్. పోతే ఇందులో ఉన్న జ్యోతి మనస్సు. అదే మనలో స్ఫురించే పదార్ధం. అందులో నిశ్చయాత్మకమైన బుద్ధితత్త్వ మేదుందో అదే రసః దాని సారం. ఈ బుద్ధి కతీతమైన సమష్టి బుద్ధి Cosmic mind ఏదో అది అమృతం. అమృత మంటే మారని తత్త్వం. మన వ్యష్టి బుద్ధులు మారినట్టు విశ్వబుద్ధి మారిపోదు గనుక దాన్ని అమృతమన్నారు.
Page 32