కాని అందులో దాని అవరోహణ గుప్తమయి ఉందని భావించాలి. ఓం భూః ఓం భువః ఓం సువః అని ఉచ్చరిస్తున్నామంటే ఇది ఆరోహణ. అంటే మనమున్న ఈ భూలోకం మీది నుంచి పైపైకి వెళ్లిపోతుంటుంది మన బుద్ధి. కాని ఈ ఆరోహణ అంతకు ముందు జరిగిన అవరోహణను సూచిస్తుంది. ఎలాగంటే ఓం సత్యం ఓం తపః ఓం జనః ఓం మహః ఓం సువః ఓం భువః ఓం భూః అని ఇవి సప్త వ్యాహృతులు. వ్యాహృతి అంటే ఉచ్చారణ. ఏడు మాట లుచ్చరించా మిప్పుడు. ఇవి ఏడూ ఏడు లోకాలకు ప్రతీకలు Sym-bols. సత్యమనే భూమిక నుంచి భూమి అనే భూమిక దాకా ఏడు భూమికలు దాటి క్రిందికి దిగి వచ్చిందా చైతన్య ధార గాయత్రీ రూపంగా. ఇది అవరోహణ క్రమం. ఇది ఇప్పుడు గుప్తమయి ఉందీ ఆరోహణ క్రమంలో. మనమున్న దిప్పుడు భూతలం కాబట్టి ఇక్కడి నుంచి మరలా మనం భూః భువః సువః అనుకొంటూ వెనక్కు ప్రయాణం చేయాలన్న మాట.
ఈ లోకాలన్నీ అక్కడెక్కడో యధార్థంగా ఉన్నాయని అక్కడికి వెళ్లి మనం చేరుతామని కూడా కాదు. అంతరార్థ మేమంటే సత్యమనేది పరమాత్మ. సత్యం జ్ఞాన మనంతమని ఉపనిష ద్వాక్యం. ఏది ఎప్పుడూ ఉంటుందో అది సత్యం. అలా ఉన్నది బ్రహ్మమే. దానికోసమే మన ఈ కర్మానుష్ఠానమంతా. బ్రహ్మ కర్మ సమారభే అని మొదటనే చెప్పాము గదా. కాబట్టి బ్రహ్మమే సత్యం. అది ఉన్నట్టుండి తపః తపస్సు చేసింది.
Page 26