#


Index

   ఏమిటింతకూ ఈ మంత్రాని కర్ధం. మన నా త్రాయతే ఇతి మంత్రః - మననం చేసే కొద్దీ మనలను కాపాడేదేదో అదీ మంత్ర మంటే. మంత్రాణా మర్ధ స్తిరోహితో భవతి అని పెద్దల మాట. మంత్రం పైకి కనిపిస్తున్నా మంత్రార్థమలా కనిపించదు. అందులో గుప్తమయి ఉంటుంది. మననం వల్లనే అది ప్రకట మవుతుంది. అది కూడా అధి భౌతిక మాధ్యాత్మిక మాధి దైవికమని మూడు భూమికలలో భావన చేయవలసి ఉంటుంది మనం. అసలాధి దైవికమైన స్థాయి నుంచే దిగి వచ్చిందది మనదాకా. మనదాకా దిగి వచ్చేటపుడది గాయత్రి. గాయతి త్రాయతే ఇతి గాయత్రీ. గానం చేస్తూ వచ్చిందది. వచ్చి మనం దాన్ని అర్థం చేసుకొంటే త్రాయతే కాపాడుతుందట. గాతారం త్రాయతే గాయంతం త్రాయతే. ఎవడా మంత్రాన్ని గానం చేస్తుంటే వాణ్ణి కాపాడుతుంది గనుక గాయత్రి అయిందన్నారు అభిజ్ఞులైన పెద్దలు. గానం చేస్తూ వచ్చింది గనుకనే మరలా మనం గానం చేస్తే కాపాడుతుంది.

   ఆ రావటమే అవరోహణ. కాపాడటమే ఆరోహణ. మంత్రం ద్వారా మంత్రాధి దేవత పరమాత్మ శక్తి మనదాకా ప్రసరించట మవరోహణ అయితే దీన్ని పట్టుకొని మరలా మన బుద్ధి అంతకంతకు ఊర్ధ్వముఖంగా ప్రసరించటమే ఆరోహణ. ఇక్కడ మన ముచ్చరించేటపు డారోహణ రూపంగా నడుస్తుంది మంత్రం.

Page 25