ఓం భూః ఓభువః ఓం సువః ఓం మహః - ఓం జనః ఓం తపః ఓం సత్యం - ఓం తత్సవితు ర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ - ఓ మాపో జ్యోతీర సో మృతగం బ్రహ్మ భూర్భువ స్సువ రోమ్
ఓంకారంతో ప్రారంభమయి మరలా ఓంకారంతో సమాప్తమవుతున్న దొక మహా మంత్రం. సోహం అనే దాని వికారమే ఓం. నేనా పరమాత్మనే ఆ పరమాత్మ ఏదో గాదు నా స్వరూపమే నని అర్థం. అంటే పరోక్షంగానూ నేనే. అపరోక్షంగానూ నేనే. నాకు భిన్నంగా మరేదీ లేదనే గొప్ప అద్వైత భావమిది. ఇది మంత్ర రూపంగా దర్శించాడొక మహర్షి. ఆయన పేరు విశ్వామిత్రుడు. విశ్వానికంతా మిత్రుడు. ఆయన దర్శించి మనకు బోధించినదే ఈ గాయత్రీ మంత్రం. ఇదే సంధ్య అని కూడా చెప్పాము దీన్ని వందనం చేయటమే చేసి మన స్వరూపంగా అనుభవానికి తెచ్చుకోటమే సంధ్యావందన ప్రక్రియ కంతా సారాంశం. ఇది తాత్పర్యమైతే దీని చుట్టూ అల్లినదంతా ఇక క్రియా కలాపమే. అది ఈ మంత్రానికి ముందూ దీని తరువాతా మనకు కనిపిస్తూనే ఉన్నది. అదంతా శరీరమైతే ఈ మంత్రమే దాని కంతటికీ ప్రాణమనుకోండి.
Page 24