త్రికరణాలలోనూ ప్రధానమైనది మానవుడి మనస్సు. దాన్నిబట్టి ఉంటుంది. మాట. దాన్నిబట్టే ఉంటుంది బాహ్యమైన చేష్ట. మనస్సులో ఏ ఆలోచన ఉంటే దాని ప్రభావమే వాక్కు మీదా కాయం మీదా పడుతుంది. పనికిమాలిన ఆలోచన అయితే మనసు అశుద్ధ మవటమే గాక దాని ననుసరించి ఇవీ అశుద్ధమయి పోతాయి. అలాకాక అందులో గొప్ప భావాలుదయిస్తే చిత్త శుద్ధే గాక వాక్శుద్దీ కాయశుద్దీ కూడా ఏర్పడుతుంది. అన్నిటికన్నా గొప్ప భావన పరమాత్మ భావన. అదే భావనతో ఉన్న మనస్సిక పరిశుద్ధం కావటంలో ఆశ్చర్య మేముంది. అది పరిశుద్ధమయితే వాక్కాయాలనే మిగతా రెండూ అప్రయత్నంగా పరిశుద్ధమవుతాయి. కనుక శరీరాన్ని స్నానపానాలతో శుభ్రం చేసుకొన్నామని గాదు మనం సంతోషించవలసింది. మనస్సు భగవచ్చింతనతో పరిశుద్ధమైతే చాలు. వీటికీ శుద్ధి ఏర్పడుతుంది. దానికి ప్రయత్నిస్తే ఇది కూడా లభిస్తుంది గాని దీనికోసమే ప్రయత్నిస్తే మాత్ర మది రాదు. ఇదీ ఇక్కడ ఉన్న కీలకం.
ఏతావతా మనసులో నిత్యమూ పరమాత్మ స్మరణ చేస్తూ బ్రతకటమే మానవుడి కర్తవ్యమదే వాడికి నిత్య నైమిత్తికాది సకల కర్మలలోనూ పవిత్రత నాపాదిస్తుందని చెప్పినట్టయింది. కాని మానవుడి జీవితం మీద ఎన్నో ప్రతిబంధక శక్తులు పని చేస్తుంటాయి.
Page 18