#


Index

ఫలశ్రుతి

   అయింది. సంధ్యా వందన మయింది. గాయత్రీ మంత్రార్ధ మయింది. రెండూ ఇక్కడికి సమాప్తమయ్యాయి. రెండని మాటే గాని సంధ్యా గాయత్రీ రెండూ వాస్తవాని కొకటే. పరమాత్మ మాయా శక్తే అది. అది మనం చేసే కర్మానుష్ఠానంలో మధ్యలో కనిపిస్తున్నా దాని పూర్వోత్తరాలు రెండు వైపులా వ్యాపించి ఉంది. అపవిత్రః పవిత్రోవా మొదలు కాయేన వాచా వరకు దాని సామ్రాజ్యమే పరమాత్మ కూటస్థమైనా ఆయన శక్తి క్రియా రూపిణి కాబట్టి దేహళీ దత్త దీప న్యాయంగా ఇటూ అటూ ప్రసరిస్తూనే ఉంటుంది. అది దాని స్వభావం. అది పరమాత్మ దగ్గర విద్యారూపిణి ఆశక్తి. అదే జీవులమైన మన దగ్గరికి వచ్చేసరి కవిద్యా రూపిణిగా మారింది. కనుకనే ఆయన మనకు స్వరూపమే అయినా దూరమై పోయాడు. ఆయన దూరమయ్యే కొద్దీ ప్రపంచం మనకు దగ్గర పడి మనలను చుట్టు ముట్టి మనకు బాధకమై కూచుంది.

   ఇప్పుడిందులో నుంచి మరలా మనం బయట పడాలంటే మన స్వరూపమే అయిన పరమాత్మను గుర్తు చేసుకొని దానివైపు తిరిగీ ప్రయాణం సాగించాలి. ప్రయాణం శారీరకం గాదు. మానసికం. ఎందుకంటే సృష్టి వాస్తవంగా జరగలేదు.

Page 149