నదీ నాం సాగరోగతిః అన్నారు. గంగానది తన స్వరూపాన్ని సాగరాయ సమర్పయామి అన్నదంటే సాగరంలో కలిసి పోవటమే. అలాగే నరుడు తన కర్మ ప్రవాహాన్ని అంతటినీ నారాయణాయ సమర్పయామి అనుకొంటూ పోవాలి ప్రతిక్షణమూ. ఎలాటి వాడా నారాయణుడు. పరస్మై. వీడు అపర అయితే వాడు పర. అంటే వీడు గుణాధీనుడయితే వాడు గుణాతీతుడు. గుణాలను గుణాతీతంగా భావించటమే ఈ అర్పణం. అర్పించే సంకల్పంతో ఏ పని చేసినా అదే త్రికరణాలనూ శుద్ధి చేసి నరుడు నారాయణుడవుతాడు. జీవ భావం బ్రహ్మ భావంగా మారిపోతుంది. సదా తద్భావ భావితః అన్నట్టు అంతా మన భావనే. వాస్తవంగా జరగ లేదు గదా ఈ సృష్టి. జగత్తు గాని జీవుడు గాని ఆ భాసే గాని వాస్తవం కాదు. వాస్తవం బ్రహ్మ తత్త్వమే. అంచేత ఆ వాస్తవమైన తత్త్వాన్ని భావిస్తూ పోతే జీవ జగత్తులు వాస్తవంగా గాక ఆభాసగా దర్శనమిస్తాయి సందేహం లేదు.
నిత్యమూ ఈ అఖండాత్మ భావనతో ఉంటే చాలు. ఈ జీవుడే కర్మ చేసినా చేయకున్నా వాడు వస్తుతః ఈశ్వర స్వరూపుడే. జీవత్వమే వాడి కాభాస అయిపోతుంది. ఇప్పుడర్ధ మవుతుంది మనకు. సంధ్యావందన ప్రక్రియలో మొట్ట మొదటి శ్లోకానికి చిట్ట చివరి ఈ శ్లోకానికీ ఉన్న సంబంధమేమిటో. అపవిత్రః పవిత్రోవా అని గదా ప్రారంభించాము మనం సంధ్యావందనం.
Page 147