అవి దాటితే ఉన్నది ఉత్తమమైన శిఖరం సహస్రార చక్రం. అదే కైలాసం. అక్కడే శివశక్తులు రెండూ ఏకం. అర్థనారీశ్వర మైన ఆతత్త్వమే జీవ బ్రహ్మైక్యానికి ద్యోతకం. అలాటి సాయుజ్యాన్ని ప్రసాదించేది బ్రహ్మాకార వృత్తి రూపిణి అయిన గాయత్రే. అప్పటికి గాయత్రి అంటే అర్థమయింది గదా. బ్రహ్మాండ పిండాండాలన్నీ వ్యాపించిన పరాశక్తి పరా విద్య గాయత్రి.
దాన్ని సాధించే ఉపాసకుడూ బ్రాహ్మణుడే. సాధించిన జ్ఞానీ బ్రాహ్మణుడే. అలాటి బ్రాహ్మణు లందరూ అనుజ్ఞ ఇస్తారా దేవికి. ఎప్పుడు స్తుతామయా వరదా వేదమాతా. వేదాలన్నిటికీ మూలభూతమైనదీ మనసారా సేవిస్తే అభీష్ట వరప్రదాయిని అయినదీ అని భావిస్తే. అలాటి భావన ఉన్నప్పుడే ప్రచోదయంతీ పవనేద్విజాతే - పవిత్రమైన ధర్మ మోక్ష పురుషార్ధాలలో బుద్ధి నా శక్తి ప్రవేశ పెడుతుంది. అలా ప్రవేశించిన బుద్ధి మంతులే ద్విజాతులు. భౌతిక జన్మే గాక జ్ఞాన జన్మ కూడా ఎత్తిన వారు. వారిలో నేనూ ఒక సాధకుడనే నమ్మా. అంచేత ఆయుః పృధివ్యాం - ద్రవిణం బ్రహ్మ వర్చసం - మహ్యం దత్వా. దీర్ఘకాల జీవితాన్ని ప్రసాదించు నాకీ లోకంలో. జీవితముంటేనే అన్నీ. లేకుంటే ఏదీ లేదు. బ్రతకటానికి కావలసిన దేమిటి ద్రావిణం. ధనం - ధనమంటే డబ్బే గాదు. కావలసిన వస్తు వాహనాదులన్నీ. అయితే ఇది ఐహికమే. పోతే ఆముష్మికం మరొకటున్నది. అది బ్రహ్మ వర్చసం. బ్రహ్మ జ్ఞానం వల్ల ఏర్పడే దివ్య తేజస్సు. ఇవి రెండే నాకభిమతమైనవి.
Page 136