ఉత్తమే శిఖరే జాతే - భూమ్యాం పర్వత మూర్ధని - బ్రాహ్మణేభ్యో భ్యను జ్ఞాతా- గచ్ఛ దేవి యధా సుఖమ్ - స్తుతామయా వరదా వేదమాతా - ప్రచోదయంతీ పవనే ద్విజాతా - ఆయుః పృధి వ్యాం ద్రవిణం బ్రహ్మ వర్చ సం - మహ్యం దత్వా ప్రయాతుం బ్రహ్మ లోకమ్ -
గాయత్రిని సంబోధిస్తున్నాడు సాధకుడు. అమ్మా గాయత్రీ మాతా! గచ్ఛదేవి యధాసుఖం - నీకు వీడ్కోలు చెబుతున్నాను. స్వేచ్ఛగా వెళ్లవచ్చు నీవు. బ్రాహ్మణేభ్యః అభ్యను జ్ఞాతా - నీ ఉపాసన నిత్యమూ చేసే బ్రాహ్మణులందరూ నీకు అనుమతి ఇచ్చారు. నీవు సామాన్యురాలవు గావు. దేవతవు. మంత్రాధి దేవతవు. ఉత్తమే శిఖరే భూమ్యాం పర్వత మూర్ధని జాతే - భూమి దగ్గరి నుంచి పర్వత శిఖరాల దగ్గరి నుంచి ఉత్తమమైన శిఖరం దాకా సర్వత్రా ఉన్న దానవు నీవు. భూమి భూలోకం. ఉత్తమ శిఖరం సత్య లోకం. సప్త లోకాలకూ వ్యాపించి ఉన్నదా పరాశక్తి అని భావం. ఇది సమష్టి విషయమైతే ఇక వ్యష్టి విషయం మన శరీరం. మన ఈ శరీరంలో అన్నమయ కోశం. పృథివీ తత్త్వం. భూలోకం. పర్వతమంటే సోపాన శ్రేణిలాగా ఉన్న మూలాధార స్వాధిష్ఠాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాలనే ఆరు భూమికలు.
Page 135