మనలో చేరి దీన్ని కనే జీవ చైతన్య రూపంగా భాసిస్తున్నది. ఇప్పుడీ జీవుడా అఖండ చైతన్యాన్ని అందుకొంటే గాని మోక్షం లేదు. అందుకోవాలంటే ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. మొదట ఆ అఖండ చైతన్యమే దేవతా మూర్తులుగా మారిందో ఆ దేవతా మూర్తులను మంచి చేసుకోవాలి. వీడు వ్యష్టి అవి సమష్టి. కనుక వ్యష్టి తన కన్నా సమష్టి అని భావించే దేవతను పట్టుకొంటే అవి తమకు కూడా అతీతమైన పరా దేవతా స్ఫూర్తిని మనకు ప్రసాదిస్తాయి. ఈ భావమే ఇప్పుడీ దిగ్దేవతా నమస్కారమనే వ్యాజంతో మనకు బయట పెడుతున్నది స్తోత్రం.
- దిగ్దేవతా నమస్కారము -
దిగ్దేవత లంటే ఎవరో కాదు. దిక్కులన్నింటినీ వ్యాపించిన పరమాత్మ విభూతి శకలాలు. దిక్కులు వాటి శరీరం. అవి వాటి వరకూ వ్యాపించిన చైతన్య ఖండాలు. దేవతలు. అష్ట దిక్కులకూ అష్ట దిక్పాలకు లున్నారు. ఆ దిక్పాలకులీ దేవతలే. తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరృతి. పశ్చిమం వాయవ్యం ఉత్తరం ఈశాన్యం ఇవీ అష్ట దిక్కులు. దిశలూ విదిశలూ రెండూ కలిసి ఎనిమిది. వీటికి వరుసగా ఇంద్రుడు అగ్ని యముడు, నిరృతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశాన్యుడు పాలకులు. అంటే దిగ్దేవతలు. ఇందులో ఆగ్నేయాది విదిశలనే అవాంతర దిశలని కూడా పేర్కొంటారు. ఇవి గాక ఊర్ధ్వ దిశ ఒకటి అధోదిశ ఒకటి రెండున్నాయి. అవి కూడా కలిస్తే మొత్తం పది. దశ దిశలంటారు వీటినే.
Page 112