వరుణ పాశం మనకీ సంసార బంధమేనని చెప్పాము. వరుణుడెవరో గాదా మరుగు పడిన పరమాత్మ స్వరూపమే. అది మనమెన్ని జన్మల నుంచి ఎన్ని దుష్కార్యాలు తెలిసీ తెలియక చేస్తూ వచ్చామో ఆ అపరాధ ఫలంగా దూరమయి పోయింది. దానివల్లనే ఆయన పాశమైన ఈ సంసార బంధం. అంచేత ఇది నిర్మూలమయి పోయి దీనిలో నుంచి మరలా మనం బయట పడాలంటే ఇమంమే హవం శ్రుధీ అని ఆ స్వరూపాన్ని తదేక చిత్తంతో ధ్యానిస్తూ ప్రార్ధిస్తూ కూచోవాలి. అదే వరుణ వ్రతం. అదే ఒక వ్రతంగా పెట్టుకోవాలి.
అలాటి వ్రతాన్ని పాటిస్తూ పోతే మనకు క్రమంగా జ్ఞానోదయమై ఆయన స్వరూపం మనకు ప్రత్యక్షమవుతుంది. అదే రాత్రి కాలం గడచి ప్రాతఃకాలం రాగానే సూర్యబింబం మనకు గోచరించటం. రాత్రి ఏదో గాదు. అజ్ఞానం. దానికి భిన్నంగా ప్రభాత మనేది జ్ఞానం. జ్ఞానంతోనే పట్టుకోవాలి పరమాత్మను. అలా పట్టుకోండి నన్నని చెప్పటానికే మనకు పరమ హితైషి అయిన మిత్రుడుగా ప్రత్యక్షమవు తుంటాడు ప్రతి దినం. మిత్రుడయి ఏమి చేస్తుంటాడు మనకు. మన శరీరాలతో సహా ఈద్యావా పృధ్వులను రెండింటినీ ధరించి ఉన్నాడు. మిత్రో జనాన్ యాత యతి. మన జీవితాలను అంతర్యామి రూపంగా నడువుతున్నాడు. మనోవాక్కాయాలనే త్రికరణాలతో మనం చేసే ప్రతి పనీ గమనిస్తున్నాడు.
Page 108