#


Index

  అందులోనూ రాముడు ధర్మమనేది ఏమిటో లోకానికి బోధిస్తే కృష్ణుడు మోక్ష స్వరూపాన్నే ఉపదేశిస్తూ పోతాడు. అలా ఇద్దరూ రెండు పురుషార్ధాలనూ పంచుకొని మనకు వర్ణించి చెప్పినా అందులో ఒక చమత్కారముంది. అదేమిటంటే కృష్ణుడు మోక్ష పురుషార్ధాన్ని ఉపదేశించినా అందులో ధర్మం కూడా తొంగి చూస్తుంటుంది. పోతే రాముడు ధర్మాన్నే చాటి చెప్పినా మోక్ష పురుషార్ధం కూడా అక్కడక్కడా గుప్తంగా ధ్వనిస్తూనే ఉంటుంది. ఆ కృష్ణుడు చేసిన బోధే భగవద్గీత లేదా ఈశ్వర గీత. కృష్ణ గీత అని కూడా దానినే పేర్కొనవచ్చు. కాగా ఇక రాముడు చేసినది రామగీత కావలసి ఉంది. అది ఎక్కడ చేశాడా బోధ అంటే అధ్యాత్మ రామాయణం చూపుతారు చాలామంది. అందులో రాముడు లక్ష్మణుడికి చేసిన ఉపదేశమది. దానినే రామగీత అని పేర్కొంటారందరూ. కాని అది వాల్మీకి రచన గాదు. కాకుంటే మరెవరిది. విశ్వామిత్ర కృతమంటారు. దానికి ప్రామాణ్య మంతగా కానరాదు. పైగా అది భగవద్గీత కంటే అదనంగా చెప్పిన అంశమంటూ ఏ ఒక్కటీ బయటపెట్టదు. పోతే ప్రస్తుతం మనం రామగీత అని పేర్కొంటున్నది వాల్మీకి రామాయణంలో రాముడు స్వయంగా చేసిన ఉపదేశం. ఒక ముప్పది ఆరు శ్లోకాలలో సంక్షిప్తంగా చేసినది. కృష్ణగీతలాగా విపులంగా గాక పోయినా సంగ్రహంగానే జీవిత సత్యాల నన్నింటినీ భావుకుడి మనస్సుకు బాగా హత్తుకొనేలాగా అందించిన సందేశమిది. అజరామరమైన సందేశం.

  ఇది రామాయణంలో రాముడు మనకు రెండు సన్నివేశాలలో అందజేసిన గొప్ప సందేశం. ఒకటి అయోధ్యాకాండలో.

Page 8