వాస్తవమే. అంతా ఈశ్వర శాసనమైనా ప్రయత్నాని కవకాశం లేకపోలేదు. ఏదో గాదది. అంతా ఈశ్వర స్వరూపమనే అఖండ భావనే ఆ ప్రయత్నం. అప్పుడు ఖండమైన ఈ మనస్సు అఖండమైన ఈశ్వర భావాన్ని అందుకొంటుంది. అప్పుడిక ఇదేమిటి ఇలా జరుగుతున్నది. ఎవరిలా చేస్తున్నారు. ఎందుకీ జీవులంటే దానికింత కక్ష అనే ప్రశ్నే రాదు. తానే ఆ ఈశ్వరుడు తనదే ఆ శక్తి.
నకర్తా కస్యచిత్కశ్చి - న్నియోగే నాపిచేశ్వరః
స్వభావంచ సమాసాద్య నకశ్చి దతి వర్తతే - 32
అలాంటి పూర్ణానుభవ మేర్పడితే చెప్పు. అప్పుడొకడు కర్త ఒకడు భోక్త అనే ద్వైత భావన లేదు. ఎవడూ ఎవడికీ కర్త కాడు. ఎవడికెవడూ భోక్త కాడు. కర్త అయినా తానే భోక్త అయినా తానే. నియోగే నాపి చేశ్వరః - ఒకరిని శాసించటానికి కక్కడ ఒక ఈశ్వరుడుంటే గదా. తనకు తానే అన్నప్పుడీశ ఈశితవ్య భావమే ఎగిరిపోయింది. మరి అలాంటప్పుడా పరాశక్తి ఏమయింది. ఏమవుతుంది. స్వభావే వర్తతే లోకః అప్పుడా మానవుడి స్వభావమే అవుతుందది. తన శక్తినంతా వ్యాపించి అందులోనే తానుంటాడు. తనలో అది దానిలో తాను. శక్తి శక్తిమంతులనే తేడా లేదు. అదే చెబుతున్నాడు పరమాత్మ. తస్యకాలః పరాయణం నరుడప్పుడు నారాయణుడే గనుక కాలమనే క్రియాశక్తి వాడికి పరాయణ మవుతుంది. పరమయనం పరాయణమని వ్యుత్పత్తి.
Page 66