కాబట్టి చేతన మచేతనమనే తేడా లేదు. సంసార మన్నప్పుడు ప్రతి ఒక్కటీ ఇందులో ఎడతెగకుండా ముందు ముందుకు సాగిపోయేదే. అంచేత ఇదే నగ్న సత్యమని ఎప్పుడు గుర్తించామో అప్పుడిక ఏడుస్తూ కూచోటం గాదు చేయవలసింది. ఆత్మా సుఖే నియోక్తవ్యః - ఎప్పుడూ సుఖంగా బ్రతికే మార్గమేమిటా అని ఆ మార్గంలోనే మనసు పెట్టి ప్రయత్నం సాగిస్తూ పోవాలి. ఎందుకంటే సుఖభాజః ప్రజాః స్మృతాః - మానవుడై పుట్టిన ప్రతివాడూ సుఖంగా ఉండాలనే ఎప్పుడూ కోరుకొంటాడు గాని కష్టపడాలని కోరడు.
అయితే ఈ సుఖమనేది రెండు విధాలు. ధర్మాచరణవల్ల కలిగేదొకటి. బ్రహ్మజ్ఞానం వల్ల కలిగే దొకటి. మొదటిది తాత్కాలికం. రెండవది శాశ్వతికం. ఇహంలో ఎవడి ధర్మం వాడు నిష్కర్షగా పాటిస్తూ పోతే మరణానంతరం స్వర్గాదులైన ఉత్తమ భోగాలను భవించగలడు. తరువాత ఈ కర్మ భూమి మీద జన్మించినా ఉత్తమ జన్మ ఎత్తి ఉత్తమ సుఖానుభవానికి నోచుకోగలడు. కాని ఇది తాత్కాలికం. పోతే శాశ్వతమైన సుఖమింకొక టున్నది. అది ధర్మం వల్లగాదు. జ్ఞానంవల్ల. నేనూ నేను చూచే ఈ సమస్తమూ నా స్వరూపమేననే ఏకాత్మ భావమే జ్ఞానమంటే. దానికిహమూ లేదు. పరమూ లేదు. ఒక లోకానికి పోవటం లేదు. రావటం లేదు. అసలు జనన మరణాలే లేవు. అంతా అలికేసినట్టు ఆత్మ స్వరూపమే. అది నిరాకారం. సర్వవ్యాపకం కాబట్టి ఎప్పటికీ నిలిచి ఉండే సుఖం. శాశ్వతమైన సుఖం. విజ్ఞానమానందం బ్రహ్మ నిత్యానంద స్వరూపమది.
Page 53