ఆత్మాన మనుశోచ త్వం -
కిమన్య మను శోచసి
ఆయుస్తే హీయతే యస్య-
స్థిత స్యచ గతస్యచ -8
ఇంతవరకూ దానిమీదా దీనిమీదా నెపం పెట్టి మభ్యపెడుతూ వచ్చి అసలు రహస్యాన్ని ఇప్పుడీ శ్లోకంలో బట్టబయలు చేస్తున్నాడు రామస్వామి. ఇక్కడ కూడా పైకిచూస్తే సామాన్యంగా చెబుతున్నట్టే కనిపిస్తుంది పరమాత్మ. అది ఎలాగంటే ఆత్మాన మనుశోచత్వం - నీ సంగతి నీవు చూచుకో భరతా - కిమన్య మను శోచసి అన్యులను గురించి ఎందుకాలోచిస్తావు. ఆరాటపడతావు. ఎవరా అన్యులిక్కడ. దశరధుడా. దశరధుడే. ఆయన వారిద్దరికీ తండ్రి. ఆయనే రామ వియోగంతో మరణించాడు హఠాత్తుగా. అది భరించలేకనే భరతు డన్నగారిని మరలా అయోధ్యకు తీసుకెళ్లాలని అరణ్యానికి వచ్చాడు. సాక్షాత్తూ తండ్రి గనుక అతడు విలపించటం సహజమే.
కాని ఎంత తండ్రి అయినా ఆయనా ఒక జీవుడే. అలాటి జీవులమే నీవూ నేనూ కూడా. ఆయన మరణించాడంటే మనం మాత్రం రేపు మరణించమా. జీవులన్నప్పుడందరూ జీవులే. జీవించినంత కాలం జీవిస్తారు. కాలం తీరితే మరణిస్తారు. అలాంటప్పుడెవరికి వారే యమునా తీరే. ఒకరి కొకరన్యులే గదా. తండ్రి అయినా అన్యుడే. తనయుడైనా అన్యుడే. తండ్రి తనయుడని మనమొకరి మీద ఒకరికున్న అభిమానం కొద్దీ పెట్టుకొన్న పేర్లు. అసలు విషయమాలోచిస్తే తండ్రేమిటి తనయు డేమిటి. అందరూ జీవులే. జీవులన్నప్పు డందరికీ రాకపోకలు తప్పవు. అలాంటప్పుడొకరు పోయారే అని మరొకరు బాధపడట మేమిటి.
Page 30