ఇదంతా ధర్మపురుషార్ధానికి సంబంధించిన వ్యవహారమైతే ఇందులో మోక్ష స్వరూపాన్ని కూడా వ్యంగ్యంగా సూచన చేస్తున్నాడు మహర్షి అదేమిటంటారా. పురుష అనీశ్వర కృతాంత అనే మూడు మాటల్లో పెట్టాడు మర్మమంతా. పురుషుడు వాస్తవంలో పురుషుడే సందేహం లేదు. అంటే పూర్ణ స్వరూపుడే. పరిపూర్ణమైన జ్ఞానమూ శక్తీ రెండూ సహజంగా ఉన్నవాడే. క్రొత్తగా సాధించి తెచ్చుకోవలసింది కాదు. సిద్ధమే అంతా. సాధ్యమేదీ లేదంటారు తత్త్వజ్ఞులు. అలాంటప్పుడు వీడీశ్వరుడే కావాలి గాని అనీశ్వరుడెలా అయ్యాడని ప్రశ్న. తనకున్న జ్ఞానైశ్వర్యాలను రెండింటినీ మరచిపోయా డవిద్య మూలంగా. అంచేత పూర్ణస్వరూపుడైనా ఈశ్వరత్వం కోలుపోయి అనీశ్వరు డనిపించు కొంటున్నాడు. అనీశ్వరు డెప్పుడయ్యాడో తన కృతాని కంతమైన సుఖదుఃఖాది ఫల మనుభవించవలసి వస్తున్నది. మరి దీనికేమిటి పరిహారం. కృతాంత అనే మాటలో ఉందది. కృతమంటే అకృతం కానిది. అంటే సహజం కానిది. కల్పితం. అజ్ఞాన కల్పితమే ఈ కర్తృ భోక్తృ రూపమైన జీవభావం. దానినంతం చేసుకోగలిగితే కృతాంతు డవుతాడు తానే. అప్పుడు తనకు భిన్నంగా ఎవడూ ఈశ్వరుడూ లేడు. కృతాంతుడూ లేడు. లేకుంటే అప్పుడసలైన అర్ధంలో పూర్ణత్వమున్న పురుషుడు తానే అవుతాడు. వేదాంతేషు యమాహు రేక పురుష మన్నట్టు పురుషుడూ తానే పురుషోత్తముడూ తానే. ఎందుకంటే పూర్ణత్వాలు రెండుండవు. ఒక్కటే. అంటే జీవేశ్వర భేదం చెరిగిపోతుంది.
Page 15