#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

ఒక శరీరంలో మరణిస్తే మరొక శరీరంలో మరలా జన్మించ వలసిందే. జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ అని తరువాత రాబోతుంది. శ్లోకం. ఇలా జనన మరణా లనుభవిస్తున్నంత వరకూ వాడు జీవుడే గాని ఆత్మ స్వరూపుడు కాడు.

  పోతే ఇక ఆత్మ అంటే ఏమిటో గుర్తించిన జ్ఞాని వ్యవహారమెలా ఉంటుంది. వాడు శరీరంలో వచ్చి ప్రవేశించినా శరీరాన్ని వదిలేసి వెళ్లినా మరొకరి ప్రమేయం లేదందులో. వాడి పాటికి వాడే వచ్చాననే ప్రజ్ఞతో రాగలడు. మరలా దీన్ని వదిలేసి పోతున్నాననే ప్రజ్ఞతోనే పోగలడు. ఒక బట్టను మనం వదిలేస్తున్నా మంటే బట్టే నేను కాను కేవలం నా కది ఒక ఉపాధి అనే జ్ఞాన ముండే గదా వదిలేస్తాము. అలాగే దాని స్థానంలో క్రొత్త బట్ట ధరిస్తున్నా అలాటి జ్ఞానంతోనే గదా ధరిస్తాము. ఇలా జనన మరణాలను రెండింటినీ ఇలాటి జ్ఞానంతోనే ధరిస్తాడు వాడు. అలాంటి జ్ఞాన మున్నప్పుడవి వాడికి జనన మరణాలే గావు. జన్మ కర్మ చమే దివ్యమ్. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున - తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరం తప అని ఉత్తరత్రా ఇరువురికీ తేడా ఏమిటో స్పష్టం చేస్తాడు పరమాత్మ. పరమాత్మా జన్మిస్తాడు మరణిస్తాడు జీవుడిలాగే. కాని వాడిది జన్మకాదు అవతారం - మరణం కాదు నిర్యాణం. ఒకచోట నేను ధరించింది శరీరం - శరీరమే నేను కాననే ప్రజ్ఞ ఉంది. మరొక చోట అలాటి ప్రజ్ఞ లేదు. ఇదీ ఇక్కడ మనమర్ధం చేసుకోవలసిన సత్యం.

Page 98

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు