#


Index

ఉపోద్ఘాతము (ప్రధమ) భగవద్గీత

  ఇలాటి అసలైన అద్వైత విజ్ఞానం లోకానికంతటికీ ఉపదేశించటమే భగవద్గీత ప్రత్యేకత. జీవ జగదీశ్వర తత్త్వాలు మూడింటికీ వస్తుతః ఏ మాత్రమూ భేదం లేదు. మూడూ కలిసి జ్ఞాన స్వరూపంగా ఏకమేనని చాటటం కన్నా విలువైన ఉపదేశమేముంది లోకంలో. అసలు జీవుడూ ఈశ్వరుడనే తేడాయే లేదు. వాడికే గాదు. వీడికీ లేవు వాస్తవంలో జనన మరణాలని చాటుతున్నది గీత. నత్వేవాహం జాతునాసం నత్వం న చైవ న భవిష్యామః - క్షేత్ర జ్ఞంచాపి మాంవిద్ధి సర్వక్షేత్రేషు - ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి - ఇలాటి అమూల్యమైన బోధ మరే మతమూ మత గ్రంధమూ చేయలేదు లోకానికింత వరకూ. అందరూ దేవుడెక్కడో ఉన్నాడు. వాణ్ణి అందుకోవాలంటే ఫలానా మార్గంలో ప్రయత్నిస్తే గాని అందుకోలేడు మానవుడని ఏకరువు పెట్టేవారే.

  అయితే ఇలాటి లోకోత్తరమైన జ్ఞానాన్ని ఒక్కసారిగా అందుకోవాలంటే లోకులందరికీ చేతగాదు. లోకంలో మధ్యములుంటారు. మందులుంటారు. అతి మందులు కూడా ఉంటారు. అంచేత వారందరినీ అంచెల వారీగా ఆస్థాయి కెదిగించాలని మరలా క్రిందికి దిగివచ్చి కర్మయోగ- సమాధియోగ భక్తియోగాలనే మూడింటినీ బోధిస్తుంది గీత. ఎందుకంటే మానవులందరూ భగవంతుడికి కావలసిన వారే. మమ వర్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఆయనే కంఠోక్తిగా చెప్పిన మాట. ప్రతి ఒక్కరూ నా మార్గంలోనే బ్రతుకుతున్నారు. కాబట్టి వారి నుద్ధరించటం నా కర్తవ్యమంటాడు భగవానుడు.

Page 7

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు