#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

  అలాంటప్పుడిక ఒకదాన్ని గురించి ఇదిపోయిందే అని విలపించటం దేనికి. నాను శోచంతి పండితాః పండితులైతే విలపించరు. పండా ఆత్మ విషయా బుద్ధిః - సా యేషాం తే పండితాః - పండ అంటే ప్రత్యగాత్మ జ్ఞానం అది ఉన్న వాడెవడో వాడు పండితుడు. అలాటి పాండిత్య మిప్పుడు అర్జునుడికి లేదు. అతడికున్నది అందరికి మల్లేనే దేహాత్మ జ్ఞానం. మహా అయితే జీవాత్మ జ్ఞాన ముండవచ్చు. ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే. అందుకే తెలివి తేటలు ప్రదర్శిస్తున్నా డాత్మ అంటే ఎంతో తెలిసినవాడిలాగా. పతంతి పితరో హ్యేషాం లుప్త పిండో దక క్రియాః - నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమ అని ధర్మశాస్త్రజ్ఞాన మంతా ఏకరువు పెడతాడు. పదిమందిని నిష్కారణంగా చంపితే నరకానికి పోతా నంటాడు. పితృపితామహు లంతా నరకంలో పడి పోతారు వారికి పిండోదకాలిచ్చే నాధుడు కూడా లేకపోతాడంటాడు. చచ్చిన తరువాత జీవు డొకడున్నాడు. వాడిహాన్ని వదలి పరానికి వెళ్లుతాడని అతడికెవరు చెప్పారు. శాస్త్రం చెప్పింది. విన్నాడు. అంత మాత్రమే. జీవుడు బ్రతికే ఉంటాడని తెలుసుగదా ఇక పోయాడే అని ఏడవటం దేనికి దేనికదే. ఇక్కడ శరీరంతో కనపడటం లేదే అని బాధ. అక్కడ బ్రతికుంటాడని విన్నామే గాని ఎక్కడ ఉంటాడో ఎన్నాళ్లుంటాడో మళ్లీ ఎక్కడ పుడతాడో ఇక మళ్లీ వాణ్ణి చూడలేమే అని కూడా బాధే.

  అందుకే అన్వశోచః ప్రజ్ఞావాదాంశ్చ భాషసే - దృష్టంగా కనపడటం లేదనీ అదృష్టంగా ఎక్కడో ఉన్నాడని రెండు మాటలూ మాటాడుతున్నాడు.

Page 52

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు