ఆత్మసంయమ యోగము
భగవద్గీత
దోషాలకూ తద్ద్వారా అవస్థాత్రయానికీ పరిష్కార మేర్పడింది. అంటే జ్ఞాని నిత్యమూ తన పాటికి తానున్నా ప్రపంచంతో వ్యవహరిస్తున్నా సమాధిలోనే ఉంటాడనే సత్యం తెలిసి పోతున్నది. అయితే యోగ యుక్తుడయి ఉండాలి. అదీ షరతు. జ్ఞానయోగంతో యుక్తమయి ఉండాలి వాడి మనస్సు. ఇది ఇంతకు పూర్వం సాంఖ్యయోగంలో చెప్పుకొన్న విద్యా వినయ సంపన్నే అనే శ్లోకానికి ప్రతిరూప మీ శ్లోకం. అదీ సమదర్శనమే చెప్పిందిదీ సమదర్శనమే చెబుతున్నది. విషమంలో సమాన్ని చూస్తే విషమమే కనిపించదు. చూపూ సమమే. చూచే ప్రపంచమూ సమమే. వ్యవహారం సాగుతున్నా ఎక్కడికక్కడ అది సమదర్శనంలో సమంగానే మారి కనిపిస్తుంది జ్ఞాన యుక్తుడైన యోగికి. వైషమ్యం మనసుకు రాదు.
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి || 30 ||
ఇలాంటి ఏకాత్మ భావ మనుభవానికి వచ్చిన జ్ఞానికి కలిగే మహాఫల మేమిటో ఇప్పుడు వర్ణిస్తున్నది గీత. ముందు వచ్చిన శ్లోకానికిది సహోదరుడు. అక్కడ ఆత్మ అంటే ఇక్కడ మామ్మనే మాట ప్రయోగిస్తున్నాడు మహర్షి. అహమ్మనే సర్వ నామానికి ద్వితీయా విభక్తి ఏకవచన రూపం మాం. నన్ను అని అర్ధం. నన్నంటే ఎవరా నన్ను. కృష్ణ పరమాత్మే బోధిస్తున్నాడు కాబట్టి పరమాత్మను అని చెప్పినా చెప్పవచ్చు. లేదా ఎవడికి వాడు నన్ను అనుకొంటాడు కాబట్టి ప్రత్యగాత్మను అని చెప్పినా చెప్పవచ్చు అర్ధం. ఏదైనా ఒకటే సర్వవ్యాపకమూ నిరాకారమూ అయిన చైతన్యం.
Page 510