ఆత్మసంయమ యోగము
భగవద్గీత
మార్గంలో ప్రయాణానికే అది అడ్డుకట్ట. అంచేత దారి కడ్డంగా ఉండే ఈ బండరాళ్ల లాంటి కామ్య విషయాలన్నీ నిర్దాక్షిణ్యంగా మనసులో నుంచి త్రోసిపుచ్చ గలిగి ఉండాలి అభ్యాసి. అలా ఉన్నప్పుడే వాణ్ణి యుక్తుడని చెప్పవచ్చు నంటుంది గీత.
యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః || 19 ||
అయితే మరి యుక్తుడైన యోగి చిత్తమెప్పుడూ సమాహితమై ఉండాలని పేర్కొన్నారు గదా. అలా సమాహితమైన యోగి చిత్తమెలా ఉంటుందో దాన్ని వివరిస్తారా అని అడిగితే దానికి గీత ఒక చక్కని దృష్టాంతం మనకు వర్ణించి చెబుతున్నది. యధా దీపో నివాతస్థః - గాలి ఎక్కువగా వీచని ప్రదేశానికి నివాత మని పేరు. గాలి అసలు లేదని గాదు. ఉన్నా చలించదు. స్తంభించి ఉంటుంది. అలాటి ప్రదేశంలో ఒక దీపం వెలిగించి పెట్టాడొకడు. పెడితే అది ఎలా కనిపిస్తుంది నీకు. నేం గతే. దాని జ్వాల పైపైకి ప్రసరిస్తూ ఇటూ అటూ ఏమాత్రమూ చలించకుండా అలాగే చక్కగా వెలుగుతూ కనిపించదా. సోపమాస్మృతా. ఇదుగో యోగి అయిన వాడి మనస్సు కదీ సరియైన ఉపమానం. యోగి నోయత చిత్తస్య - యుంజతో యోగమాత్మనః - యోగి కూడా మనసులోని ఆలోచనలన్నీ కట్టిపెట్టి నిర్మలమూ ఏకాగ్రమూ చేసుకొని కూచుంటాడు. అలాగే యోగ మభ్యసిస్తూ పోతాడు. గాలిలాగా వాడి మనసునే కోరికలూ అటూ ఇటూ చెదర గొట్టవు. దీపంలాగా వెలుగుతూనే ఉంటుందది.
Page 487