ఆత్మసంయమ యోగము
భగవద్గీత
సాధన చేయవలసింది మనసే. శరీరం కాదు. శరీరం మరీ వాలుతూ సోలుతూ పోతే మనసు నిలబడదు. అదీ చెదిరిపోయే ప్రమాదముంది. అందుకోసం చెప్పారు ముందుగా శరీరమెలా ఉండాలో. పోతే ఇప్పుడు ప్రధాన సాధనమైన మనసు దగ్గరికి వచ్చి మాటాడుతున్నాడు మహర్షి.
తత్రైకాగ్రం మనః కృత్వా, ఊరక ఆసనం వేసుకొని శరీరం నిటారుగా ఉంచుకొని కూచోటం కాదు. అలా కూచున్నా మనసు అటూ ఇటూ చెదరిపోతుంటే సుఖం లేదు. ఏకాగ్రం కృత్వా ఏకాగ్రం చేసుకోవాలి దాన్ని. ఒకే అగ్రం మీద మనసు పెడితే అది ఏకాగ్రం Concentration. అలా కాకుంటే వ్యగ్రమంటారు దాన్ని. అగ్రమంటే ఇక్కడ లక్ష్యం. ఏది చూడాలో అదే చూడటం. అదే చూడాలంటే మనసక్కడే నిలవాలి. నిలవాలంటే నిలపాలి దాన్ని. నిలపాలంటే చిత్తమూ ఇంద్రియాలూ - వాటి క్రియలు లేదా వ్యాపారాలు తమ ఇష్టానుసారం వెళ్లిపోతుంటే నిలపలేవు. అవన్నీ నీ వశంలో ఉండాలి. పరిపరివిధాల పోకుండా నీవేది చూడమంటే అదే చూడాలవి. దానిమీదనే ప్రసరిస్తూ ఉండాలి. అప్పుడే యత చిత్తేంద్రియ క్రియు డవుతాడు సాధకుడు. అలా అయ్యాడంటే వాడప్పుడే ఆసనం వేసుకొని కూచున్నా ఫలితముంటుంది. ఉపవిశ్యాసనే. అలా శరీరమూ మనసూ ఇంద్రియాలూ కదలకుండా కూచుని యుంజ్యాద్యోగం యోగాభ్యాసం చేస్తూ పోవాలి సాధకుడు. అభ్యాసం చేస్తూ పోతే ఏమిటి ఫలితం. దేన్ని ఉద్దేశించి ఈ సాధన చెబుతున్నాడు. ఆత్మ విశుద్ధయే.
Page 474