ఆత్మసంయమ యోగము
భగవద్గీత
కూచోట మెక్కడ. ఏదైనా వేసుకొని కూచోవాలా. లేక వట్టినేల మీదనే కూచోవచ్చా అని ప్రశ్న వచ్చింది. దానికి సమాధాన మిస్తున్నది గీత. చేలాజిన కుశోత్తరం - చేలమంటే వస్త్రం. అజినమంటే చర్మం. కృష్ణాజినం లాంటిది. కుశమంటే దర్భ. ఉత్తరమంటే ఒకదానిమీద ఒకటి. అంటే మొదట ఒక అంగవస్త్రం పరిచి దానిమీద జింకచర్మం దానిమీద దర్భలూ పరుచుకొని కూచోమనా సలహా. అలా కాదంటున్నారు భాష్యకారులు. పాఠక్రమమిదే అయినా దాన్ని తీసుకోగూడదు. అర్థక్రమమే పాటించా లంటారాయన.
దాన్నిబట్టి చెప్పుకొనే ట్టయితే మొదట దర్భలూ - తరువాత దానిమీద అజినమూ దానిపైన వస్త్రమూ పరుచుకోవలసి ఉంటుంది. అసలిదే సరియైన విధానం. అలా కాని పక్షంలో దర్భలే అన్నిటికీ పైన ఉండవలసి వస్తుంది. వస్తే అవి శరీరానికి ప్రతి క్షణమూ గుచ్చుకొంటూ సాధకు డిబ్బంది పడే అవకాశముంది. ఇప్పుడిదంతా పూర్వ రంగమే యోగికి. ఏకాంతమైన స్థలం చూచుకోటమూ అది పరిశుద్ధంగా ఉండటమూ చేలాజిన కుశోత్తరంగా శరీరమక్కడ నిలపటమూ ఇదంతా ఉపాధుల నెలా అదుపులో పెట్టుకోవాలో శిక్షణ నిస్తున్నది గీత. అలా దేహధారణ చేసిన తరువాత ఏమి చేయాలని అడిగితే ఇప్పుడా విషయం బయటపెడుతున్నది.
తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః |
ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మవిశుద్ధయే || 12 ||
అలా నిశ్చలంగా కూచున్న తరువాత సాధకుడు శరీరం వరకే చూడగూడదు. మనసు కూడా నిశ్చలం చేసుకోగలిగి ఉండాలి. ముఖ్యంగా
Page 473