కర్మసన్యాస యోగము
భగవద్గీత
సుఖ మనిపించినా పోను పోనది దుఃఖానికే దారితీస్తుంది. దుఃఖంలేని సుఖమంటూ లేదు లోకంలో. అందుకే దుఃఖాలయ మశాశ్వతమని చాటుతుంది గీత.
అది అశాశ్వత మని గ్రహించినవాడు బాహ్యస్పర్శే ష్వసక్తాత్మా బాహ్యమైన శబ్దస్పర్శాదులలో పడిపోడు. ఆత్మా అంటే ఇక్కడ మనస్సని అర్థం. వాడి మనస్సు తగులుకోదు బాహ్య విషయాలలో. మనసే కదా ప్రధానం దేనికైనా. ఏ అనుభవమైనా మనసుకే ప్రపంచాను భవమైనా దానికే ఆఖరుకు బ్రహ్మానుభవమైనా దానికే. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః అని గదా శాస్త్రోపదేశం. కాబట్టి మనసు బాహ్య విషయాలలో కాదు సక్తం కావలసింది. సక్తమైతే అది బంధకమే ఆ సుఖం. సుఖం లేదా అంటే లేదని గాదు. విందత్యాత్మని యత్సుఖం. ఎంతో కొంత పొంద వచ్చునీవు. కాని అది కొంతే. అనంతం గాదు. ఎందుకంటే పిండికొద్దీ రొట్టె అన్నారు. అసలా బాహ్యపదార్థాలే పరిచ్ఛిన్నం. అల్పం. తాత్కాలికం. మరి వాటివల్ల కలిగే సుఖ మనల్పం శాశ్వత మెలా అవుతుంది.
అంచేత అది ఎప్పటికీ ఆసించడు జ్ఞాని. వాడికి బాహ్యమైన శబ్ద స్పర్శాదులు కనిపించవు. వాటి వల్ల కలిగే సుఖమంత కన్నా కనిపించదు. అవి కనిపించేది మిగతా లోకులకే. వారికి ప్రపంచం తప్ప దాన్ని మించి మరొక పరమార్థ మంటూ లేదు. కనుక ఆ పొందే అల్పమైన ఆనందమే వారి పాలిటికి బ్రహ్మానందం. పోతే ఈ జ్ఞాని కలాకాదు. వీడికి బ్రహ్మం తప్ప మరేదీ కనిపించదు. బ్రహ్మమూ బ్రహ్మమే వాడి దృష్టికి ప్రపంచమూ బ్రహ్మమే. సబ్రహ్మయోగ యుక్తాత్మా. బ్రహ్మంతోనే యోగం వాడికెప్పుడూ.
Page 423