విషాద యోగము
భగవద్గీత
అది ఎలా చేసుకోవాలంటే అశరీరం శరీరేషు. మన ఈ శరీరంలోనే ఉందది అశరీరంగా. దాన్నే నీవు నీ శరీరం మేరకే చూస్తున్నావిప్పుడు. కనుకనే శరీర బంధం పోతే దానితోపాటు నేను పోయానని మరణాన్ని కొని తెచ్చుకొంటున్నావు. అలా కాక మహాంతం విభు మాత్మానం మత్వా ధీరో నశోచతి. దానికీ శరీరపు టెల్లలు తప్పించి సర్వత్రా ఆకాశంలాగా వ్యాపించినట్టు సర్వ పదార్ధాల రూపంగా అదే భాసిస్తున్నట్టు భావించు. అప్పుడు శరీరం పోయినా నీవు పోవు. సర్వత్రా పరుచుకొని ఉండి దీని రాకపోకలు సాక్షిగా గుర్తిస్తుంటావు. మృత్యు నిమిత్తమైన శోకం నీకు తప్పకుండా తప్పిపోతుంది. ఇదీ ఉపనిషద్భోధ.
ఒక్క కఠోపనిషత్తునే కాదు. ఈ పరిష్కరించుకొనే విధానంలో ఛాందోగ్యాన్ని కూడా చక్కగా అనుసరిస్తూ పోయింది భగవద్గీత. పైకి కనపడదా అనుసరణ. కాని గీతానిర్మాణ ప్రణాళికలోనే అది తొంగి చూస్తున్నదని ఆ రహస్యాన్ని బయటపెట్టారు శ్రీధర మధుసూదనాది వ్యాఖ్యాత లందరూ. అదేదోగాదు. ఛాందోగ్యం 6వ అధ్యాయంలో శ్వేత కేతువు కుద్దాలకుడు చేసిన తత్త్వమసి వాక్యోపదేశం. తొమ్మిది మార్లు బోధించాడు మహర్షి తత్త్వమసి వాక్యాన్ని. బహుశా నవావరణ రూపమైన అమ్మవారి రాజ్యాన్ని దాటి దశమ స్త్వమసి అన్నట్టు దశమమైన అయ్యగారి ఆత్మ సామ్రాజ్యంలో ప్రవేశించండని మనకు బోధ చేయటానికి సంకేత మేమో.
Page 42