#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత


  సుఖాలపాలు చేస్తున్నదని చూస్తే అది జీవాత్మ. రెండాత్మలున్నాయని కాదు మరలా. ఒకే ఆత్మ విద్య ఉన్నదైతే పరమాత్మ. విద్యను కోలుపోయి అవిద్యావంతమైతే జీవాత్మ. మొదటి దశలో దానికీ కర్తృత్వాదు లేవీ లేవు. రెండవ దశలో అన్నీ ఉన్నాయి. కనుకనే అవిద్యాలక్షణా ప్రకృతిః మాయా ప్రవర్తతే. అవిద్యాలక్షణమైన మాయే ఈ కలాపమంతా నడుపుతున్నది గాని ఆత్మకు సంబంధం లేదని అర్ధం చెబుతారు భాష్యకారులు. ఒకే మాయాశక్తి పరమాత్మ దగ్గర విద్య. జీవుడి దగ్గర అవిద్య. మాయను వశీకరించుకొన్న చైతన్య మీశ్వరుడు. మాయకు వశమైన చైతన్యం జీవుడు. ఆ మాయే అప్పుడు జీవుడిక విద్య అయికూచుంది. అవిద్య అంటే అజ్ఞానం. నేనీశ్వరుడనే అని గుర్తించక పోవటం.

నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః |
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః || 15 ||

ఇలా మన జ్ఞానాజ్ఞానావస్థ వల్లనే ఈ జీవేశ్వర భేద మేర్పడుతున్నది గాని అసలు వస్తు సిద్ధంగా ఉన్న దొక్క ఈశ్వర చైతన్యమే. ఆకాశం లాగా నిరాకారమైన చైతన్యంలో జీవేశ్వరులనే తేడా అసలెలా ఏర్పడగలదు. ఘటాకాశ మొకటి మహకాశ మొకటి రెండుంటాయా ఆకాశాలు. రెండు ముక్క లయిందా ఆకాశం. అలాగే చిదాకాశం మాత్రంరెండు భాగాలవుతుందా. అయితే అది చైతన్యమే కాదు. కాబట్టి వస్తుసిద్ధంగా జీవుడూ ఈశ్వరుడూ అనే భేదం లేదు. రెండూ కలిసి కేవలం పరిశుద్ధమైన ఆత్మ స్వరూపమే. దానికి వ్యతిరిక్తంగా వేరొకటేదీ లేదు. జీవేశ్వరులనే తత్త్వాలు రెండేర్పడటమే అసంభవం.

Page 408

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు