#


Index

విషాద యోగము భగవద్గీత

  ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ కల్పన. జీవితమంతా కండ్లకు కట్టినట్లు చూపుతున్న దుపనిషత్తు. ఇది ఎంతో వ్యంగ్యంగా బయటపెడుతున్నాడు వ్యాసుడు. ఎలాగ. కురుక్షేత్ర మేదోగాదు సంసారమే. అర్జునుడెక్కి కూచున్న రధ మీ శరీరమే. అర్జునుడు నీవూ నేనే. నరుడని పేరు గదా అర్జునుడికి. నరులమే గదా మనం కూడా. పోతే సారధి ఎవరు బుద్ధి అని గదా వర్ణించిం దుపనిషత్తు. అది కృష్ణ పరమాత్మే. మరి గుఱ్ఱాలో. మన ఇంద్రియాలే అర్జునుడి గుఱ్ఱాలు. కాదా అవి వెళ్ళిపోయే మార్గాలు ఆ సైనికుల మధ్యలో ఉన్నవే. కౌరవ పాండవ సైన్యాలు కూడా ఏవో కావు. దైవాసుర సంపదలకు ప్రతీకలే. అదే దైవాసుర సంప ద్విభాగ యోగంగా మలిచి చూపాడు గీతలో వ్యాసమహర్షి. పోతే ఈ దేహాత్మ భావం వదలకుండా బాధపడుతున్నాడే అర్జునుడు. వాడు అలాటి అభిమానంతో కొట్టు మిట్టాడుతూ సాంసారిక మైన సుఖదుఃఖా లనుభవించే ప్రతి ఒక్క మానవుడే. ఇంతకూ కఠోపనిషత్తు బాహాటంగా చెప్పిన కధ వ్యంగ్యంగా సూచిస్తున్నాడు వ్యాస భగవానుడు.

  పోతే ఈ సుఖదుఃఖాదుల భోక్తృత్వాని కేమిటి పర్యవసాన మని అడిగితే మరణమేనని చాటుతున్నది కఠోపనిషత్తు. ఒక మరణంతో సమసిపోదు. మరణం జననానికీ జననం మరణానికీ ఎడతెగని ఒకానొక విషవలయమిది. ఇది ఏమిటీ మరణ మనేది. దీని కేమిటి పరిష్కారమని యమధర్మరాజునే నిలదీసి అడిగాడొక కుర్రవాడు. అతని పేరు నచికేతుడు.

Page 28

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు