విషాద యోగము
భగవద్గీత
కఠోపనిషత్తు నమూనాలో నిర్మించాడా అని తోస్తుంది వ్యాసభట్టారకుడు. సంసారాన్ని ఒక అశ్వత్థ వృక్షంతో పోల్చింది ఉపనిషత్తు. ఊర్ధ్వమూలో వాక్శాఖః ఏషో శ్వత్థ స్సనాతనః ఇదే అందుకొన్నాడు వేదవ్యాసుడు. ఆయన మరి వేద వ్యాసుడు గదా. వేదాల గుట్టుమట్లన్నీ తెలిసిన వాడికి ఉపనిషత్తుల బాణీ ఏదో ఎలాంటిదో తెలియదా. తెలుసు గనుకనే అదే వాడుకొన్నాడు గీతలో. ఏమని. పురుషోత్తమ ప్రాప్తి యోగమంతా అదే. ఊర్ధ్వమూల మధశ్శాఖమని కఠోపనిషత్తు లాగే వర్ణిస్తూ పోతాడు.
అంతేకాదు. మరి ఈ వృక్షమనే అడ్డు తొలగించుకొని బయటపడే మార్గమేమిటని అడిగితే కరోపనిషత్తు చెప్పిన మాటే చెబుతున్నాడు. ఏమని చెప్పింది కఠోపనిషత్తు. ఆత్మానం రథినం విద్ది - శరీరం రథ మేవ తు బుద్ధింతు సారధిం విద్ధి మనః ప్రగ్రహ మేవచ ఇంద్రియాణి హయా నా హుః - విషయాం స్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే త్యాహుర్మనీషిణః సంసారమొక యుద్ధభూమి అనుకొంటే అందులో తిరిగే మన శరీర మొక రథం అందులో కూచొని బ్రతుకుతున్న మనమే రథికులం - మన బుద్ధే ఈ శరీరమనే రథాన్ని నడిపే సారథి. దీన్ని ముందుకు లాక్కొని పోయే గుఱ్ఱాలు మన ఇంద్రియాలే. అవి పరుగెత్తే దారు లేవో గావు. శబ్ద స్పర్శాదులైన విషయాలే. పోతే ఈ దేహేంద్రియాలే నేనని వీటితో తాదాత్మ్యం చెంది ఈ సంసార సుఖదుఃఖాలను భవించటమే మనం జీవులుగా సాగిస్తున్న జీవితం.
Page 27