#


Index

కర్మ యోగము భగవద్గీత

తాను చెడి పదిమందిని చెడొగొట్టే బాపతువాడు. అలాటి వాడి మాట వింటారు. వాడి మార్గమూ అనుసరిస్తారు లోకులు. పోతే అలా కాక అన్నివిధాలా శ్రేష్ఠుడైన మహానుభావుడూ ఉంటా డొక్కొక్కడు. వాడు తానా చరించి లోకు లందరినీ అలాగే ఆచరించమని బోధిస్తాడు. వాడి మాటా వింటారీ లోకులు. అందరూ కాకపోయినా కొందరైనా వీణ్ణి అనుసరించి బాగుపడవచ్చు. కాబట్టి గొప్పవాడెప్పుడూ లోకాన్ని పెడదారి పట్టించడు. మంచి మార్గంలోనే తీసుకు పోతాడు.

  ఇది ఎంత గొప్ప సుభాషితమంటే ఈనాటి సాంఘిక రాజకీయ నైతిక ధార్మిక వైయక్తిక వైజ్ఞాని కాధ్యాత్మికాది అన్ని రంగాలలో మనకు కండ్లకు కట్టినట్టు కనపడే సత్యం. మంచి చెప్పే వాడున్నాడు. చెడ్డ చెప్పే వాడున్నాడు. అందులో చెడ్డకు మంచి అనే రంగు పూసి లోకులను తమ దారికి తిప్పుకొనే వాళ్లే నూటికి తొంభయిమంది తరుచుగా అన్ని రంగాలలో కనిపించేది. Cheap popularity కోసం ప్రయత్నించే నాయకులందరూ వారే. అయితే వారు గీత చెప్పిన శ్రేష్ఠులు గారు. శ్రేష్ఠమ్మన్యులూ శ్రేష్ఠాభాసులూ. అలాటివారి మాటలను నమ్మి బేలుపడే వారే ఎక్కువమంది అయినా నిజంగా శ్రేష్ఠులయిన వారు కూడా లేకపోలేదు. ఎక్కువ మంది కాకున్నా కొంతమందైనా వారి మార్గంలో నడుచుకోని వారూ లేకపోలేదు. అలాంటివారే ఆధ్యాత్మిక రంగంలో నలుగురికీ దర్శకులైన మహానాయకులు. వారి ననుసరిస్తేనే బాగుపడుతుందీ లోకం. నీవూ అదే అవలంబించు అర్జునా. అర్జునా అనే సంబోధన ఆనాటి అర్జునుడికే గాదు. మనకూ కూడా ఇది గొప్ప హెచ్చరిక. సార్వజనీనమైన సందేశమిది.

Page 243

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు