సాంఖ్య యోగము
భగవద్గీత
మానవుని సకలానర్ధాలకూ మూలమింతకూ విషయాభి ధ్యానమని వర్ణించింది గీత. దానివల్ల కలిగే నష్టం కూడా చెప్పింది స్పష్టంగా. పోతే ప్రస్తుతం దానికి భిన్నంగా మోక్ష కారణ మేమిటో ఆ విషయాన్ని వర్ణిస్తున్నది. రాగద్వేష వియుక్తాస్తు విషయానింద్రియైశ్చరన్ ఇంద్రియార్థాలైన శబ్ద స్పర్శాదుల ఆలోచనే అనర్ధానికి కారణమని చెప్పామంటే అసలు ఆలోచనే మానేసి కూచోమని కాదు అర్ధం. కాకపోయినా ఏ ఆలోచనా లేకుండా ఒక్క క్షణమైనా కూచోలేవు. ఆ విషయమిక చెప్పబోతుంది కూడా గీత. నీవొక వేళ అలా కూచుందా మానుకొన్నా కూచోనివ్వదు ప్రకృతి. నీచేత బలవంతంగానైనా పని చేయిస్తుంది. అంచేత అదిగాదు శాస్త్రం నీకు బోధించదలచిన విషయం.
అయితే మరేమిటి. విషయా నింద్రియైశ్చరన్ శబ్దస్పర్శాదులైన ఇంద్రియ విషయాల నింద్రియాలతో ఆలోచించు. అనుభవించు. కాదనలేదు. కాని రాగద్వేష వియుక్తాస్తు. ఆ ఇంద్రియాలను బాగా శుద్ధి చేసుకొని ఆ తరువాత అనుభవించు. సహజంగా అవి పరిశుద్ధమైనవి కావు. రాగద్వేషాలనే కాలుష్య ముంటుంది కావలసినంత. అవే నడుపుతుంటాయి మనస్సును గాని ఇంద్రియాలను గాని. అది వెనకాల జేరి ప్రేరణ చేస్తుంటే ఇవి విషయాల మీదికి లంఘిస్తుంటాయి. అంచేత అన్నిటికంటే ముందు మానవుడీ రాగద్వేషాలను కడిగిపారేయాలి. కడిగేస్తే పరిశుద్ధ మవుతాయి నీ అంతరింద్రియమూ బహిరింద్రియాలూ.
Page 182