విషాద యోగము
భగవద్గీత
పరలోకాలున్నాయి - జన్మాంతరా లున్నాయని చాటి చెప్పే మీమాంసకుడి జ్ఞానం కూడా పరిమితమే. దీనికే విశేష జ్ఞానమని పేరు. అక్కడి కక్కడ పరిచ్ఛిన్నమే కాని అది పరిపూర్ణమైన జ్ఞానం కాదు. సామాన్యమైన జ్ఞానమే పరిపూర్ణమైనది. కనుకనే దానికి భిన్నమైన జ్ఞానాలన్నిటినీ అపర విద్యలని త్రోసిపుచ్చింది ముండకోపనిషత్తు ఋగ్వేదం దగ్గరి నుంచీ ఈనాటి Computer Sciences వరకూ అన్నీ అపర విద్యలే. పోతే ఇలాటి అజ్ఞాన మున్నంత వరకూ సుఖం లేదు. అది సంశయమనే మరొక వ్యాధికి దారి తీస్తుంది. కొంత తెలిసిన వాడికి మిగతాదంతా సందేహమేగదా. జీవ జగదీశ్వరులు మూడూ ఆత్మ స్వరూపమేనని గుర్తిస్తే అది పరిపూర్ణమైన సామాన్య జ్ఞానం. అలాంటి జ్ఞానానికి నోచుకోకపోతే అంతా సందేహమే. కాగా ఇలాటి సంశయమనే వ్యాధి ఎప్పుడేర్పడిందో అది మరొక మూడవ వ్యాధిని కల్పించింది. అదేదో గాదు విపర్యయం. అంటే అంతా ఆత్మ స్వరూపంగా గాక అదే జీవ జగదీశ్వరులుగా మారి మనలనీ సంసారంలో పడ దోస్తుంది. విపర్యయ మంటే తల క్రిందులు గావటమని అర్థం. ఆత్మ అనాత్మ ప్రపంచంగా మారటమే తల క్రిందులంటే. కనుక ఇవి మూడూ మనకందరికీ పట్టుకొన్న మూడు ప్రబలమైన వ్యాధులు.
వ్యాధి అని ఎప్పుడన్నామో అప్పుడు దానికి చికిత్స చేసుకోవటం మన కర్తవ్యం. ఎవడికి వాడు చేసుకోలేడు కాబట్టి ఒక వైద్యుడు కావాలి మనకు. అతడు చికిత్స చేస్తే మన కనారోగ్యం పోయి ఆరోగ్యమనే ఫలితం చేకూరటం అన్నిటికన్నా ముఖ్యం. ఇంతకూ వ్యాధీ వైద్యుడూ
Page 17