విషాద యోగము
భగవద్గీత
బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యు డిలాగే ఉపదేశిస్తాడు తన భార్య మైత్రేయికి. ఆత్మావా అరే ద్రష్టవ్యః ఆత్మను చూడాలి మైత్రేయీ నీవు. అది ఎలాగో తెలుసా. శ్రోతవ్యో - మంతవ్యో - నిదిధ్యాసితవ్యః శ్రవణం చేయి మొదట తరువాత మననం చేయి ఆ తరువాత ధ్యానం చేయి అలా చేస్తే నీకు తప్పకుండా ఆత్మ సాక్షాత్కార మవుతుందంటాడు. అసలు విషయ మేమిటంటే మనకందరికీ మూడు వ్యాధులున్నాయి. మనకంటే మనలో చదువు సంధ్యా లేక పామరంగా బ్రతికే మానవులకే గాదు. అంతో ఇంతో చదువుకొన్న పండితులకూ శాస్త్రజ్ఞులకూ కళాకారులకూ తుదకు నాలుగు వేదాలూ ఏకరువు పెట్టిన ధర్మశాస్త్రజ్ఞులకూ - సర్వే సర్వత్రా పట్టుకొన్న వ్యాధులివి. సర్వభూతాని సమ్మోహం సర్దేయాంతి అన్నట్టు పుట్టుకతోనే సంక్రమించినవి. ఆఖరు కొక్క విదేహ ముక్తుడేమైనా తప్పించుకొంటాడేమో గాని జీవన్ముక్తుడికి కూడా ప్రారబ్ధ రూపంగా వెంటాడే బాపతే. ఇంతెందుకు. భూమండలం మీద శరీర మనే ఉపాధితో బ్రతుకుతున్న ప్రతి మానవుడూ వ్యాధిగ్రస్తుడే. ఒకటిగాదు. రెండుగావు. మూడు వ్యాధులు. అందరికీ సంక్రమించిన సాంక్రామికమైన వ్యాధులు.
ఏమిటా వ్యాధులు. అజ్ఞాన మొకటి - సంశయమొకటి - విపర్యయ మొకటి. అజ్ఞాన మంటే అసలు జ్ఞానమే లేదని గాదు. బుద్ధి జీవులైన మానవుల కంతో ఇంతో జ్ఞానముండనే ఉంటుంది. కాని పామరుడు మొదలు పండితుడి వరకూ ప్రతి ఒక్కడి జ్ఞానమూ పరిమితమైన జ్ఞానమే.
Page 16