సాంఖ్య యోగము
భగవద్గీత
చేస్తుంటారు కాబట్టి ఫలానుభవానికి మరలా జన్మించక తప్పదు. జన్మిస్తే మరలా మరణించకా తప్పదు. ఇలా జన్మ మరణ పరంపరకు గురియైన వారు శోచనీయులు కాక మరెవ్వరు. కనుకనే కృపణులని పేర్కొనటం. సరిగా బృహదారణ్యకం చెప్పిన మాటకిది ప్రతిధ్వని. - యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వా ప్రతి స కృపణః ఈ అక్షరమైన ఆత్మ తత్త్వాన్ని గుర్తించకుండానే కన్నుమూసిన ప్రతిమానవుడూ కృపణుడే సుమా అంటాడు యాజ్ఞవల్క్యుడు గార్గితో.
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ || 50 ||
కాబట్టి ఇంతకూ మనమర్ధం చేసుకోవలసిన దేమంటే సమత్వ బుద్ధి అనేది మామూలు కర్మాచరణ కన్నా ఎంతో గొప్పది. మామూలు కర్మ మోక్షమార్గానికి విజాతీయంగా సాగుతూ పోతే ఇది దానికి సజాతీయంగా సాగిపోయే వ్యవహారం. బుద్ధియుక్తో అలాంటి విశిష్టత ఇందులో ఉందని గుర్తించి ఆ మార్గంలోనే పయనించే సాధకుడు జహా తీహ ఉభే సుకృత దుష్కృతే. సుకృతం దుష్కృత మనే తేడా చూడడు. పుణ్యపాపాలు రెండింటినీ అవలీలగా వదిలేస్తాడు. ఒక పక్క కర్మ చేస్తూనే ఎలా వదిలేయగలడని సందేహించ పనిలేదు. కర్మానుష్ఠానం కాదు. కర్మయోగమిది. దానివల్ల సత్త్వం శుద్ధి అవుతుంది కర్మయోగికి. సత్త్వమంటే అంతః కరణం. అది ఎప్పుడు శుద్ధమయిందో అందులో జ్ఞానబీజాలు తప్పక అంకురిస్తాయి. దాని బలంతో సుఖదుఃఖాలు పుణ్యపాపాలనే ద్వంద్వాలకు వీడ్కోలు చెప్పగలడు సాధకుడు.
Page 153