సాంఖ్య యోగము
భగవద్గీత
ఆమార్గంలో ప్రయాణం చేయలేదు బుద్ధి. సమాధి అంటే ఏకాగ్రమైన అంతః కరణం. ఆలోచిస్తే వీరాసించే సమస్తమూ అందులోనే గుప్తమయి ఉంది. లోకాలూ లోకాంతరాలూ అన్ని సుఖానుభవాలూ అక్కడే గుప్తమయి ఉన్నాయి. అవి ప్రకటమై మనకు కనపడాలన్నా అనుభవానికి రావాలన్నా పరిశుద్ధమైన ఏకాగ్రమైన బుద్ధి అవసరం మానవుడికి. అప్పుడే అది నిలకడ చెంది అన్ని ఫలానుభవాలనూ మనకంద జేస్తుంది. మరి అలాంటి వ్యవసాయాత్మకమైన బుద్ధి ఎక్కడిదీ బేవకూఫులకు. కనుకనే గుడ్డెద్దు చేలో పడ్డట్టు యాంత్రికంగా కర్మలు చేయటాని కలవాటు పడ్డారే గాని దీనికి మూలభూతమైన తత్త్వమేమిటా - చివరకు మన జీవితానికి గమ్యమేమిటా అని ఏ మాత్రమూ ఆలోచన రాదు వీరికి. ఇక జ్ఞానమేమిటి యోగమేమిటి. కలలోని వార్త అది.
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ || 45 ||
ఈ విధంగా వివేక బుద్ధిని కోలుపోయి కేవలం కామపరాయణులయి బ్రతుకు సాగించే ఈ కర్మోపాసకులకు కలిగే స్వర్గాది ఫలం కూడా త్రిగుణాత్మకమే గాని గుణాతీతం కాదు. సత్వరజస్తమస్సులనే ప్రకృతి గుణాలే గుణాలంటే. అవి మానవుణ్ణి ఈ శరీర మనః ప్రాణాలతో ముప్పేటగా చుట్టికట్టి పారేశాయి. మన మనస్సు సత్త్వం. మన ప్రాణం రజస్సు. పోతే మన శరీరం తమస్సు. శరీరమనః ప్రాణాలను తప్పిస్తే నీవూ నేనూ ఎక్కడ ఉన్నాం. ఖాళీ అయిపోయాం.
Page 140