సాంఖ్య యోగము
భగవద్గీత
అంటగట్టు కొంటావు. ప్రతిష్ఠ కోలుపోవట మొక నష్టమైతే దానికి మారుగా పాపానబడి పోవటం మరొక నష్టం. రెండు నష్టాల పాలవుతాడు మానవుడు. అర్జునుడనే గాదు. ఏ మానవుడైనా లోకంలో తనకు విహితమైన ధర్మాన్ని తాను ఆచరించాలి. ధర్మం చర అని గదా శాస్త్రం చెబుతున్నది. ఆచరిస్తేనే అది ధర్మం. ధర్మ మాచరించటం లేదంటే దానికి ప్రత్యవాయ దోషమని పేరు. దానివల్ల లోకంలో సోమరి పనికిమాలిన వాడని చెడ్డపేరు తెచ్చుకోటమే గాక అధర్మపరుడై చివరకు నరకానికే టిక్కెట్టు తీసుకొంటాడు.
ఇది ఒక బిభీషిక. అంటే బెదిరించటం. ఎందుకీ బెదిరింపు అలా బెదరగొడితేనైనా వీడు బద్ధకించకుండా నిర్లక్ష్యంగా బ్రతకకుండా ధార్మికమైన జీవితం జీవిస్తాడని ఆశ. అయ్యో దీనివల్ల ఇంత ఉపద్రవం వచ్చి పడుతుందా అయితే ఇప్పటికైనా మేలుకోటం మంచిది. ఇక మీదటనైనా మన ధర్మం మనం పాటిద్దాం. దానివల్ల మేలు మాట అలా ఉంచి కీడైనా జరగకుండా పోతుందని ధర్మానుష్ఠానం వైపు మొగ్గుచూపుతాడు మానవుడు. ఇదీ శాస్త్ర హృదయం.
అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్ |
సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే || 34 ||
ఇంకా భయపెడుతున్నాడు పరమాత్మ. అబ్బాయీ నీవు మోక్షానికి నోచుకోక పోతే పోయావు. కనీసం ధర్మాచరణ కైనా నడుం కట్టు. అలా కట్టక పోయావో రెంటికీ చెడ్డ రేవడవయి పోతావు జాగ్రత్త. అకీర్తించాపి భూతాని కధయిష్యంతి. కలకాలమూ నీ కపకీర్తి వస్తుంది లోకంలో.
Page 119