#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

అర్జునుడికే చెప్పాడని కాదిక్కడ మనం చూడవలసింది. అక్కడ కధలో అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధమనే ప్రస్తావన వచ్చింది. పోతే మన సంగతేమిటి. మనం క్షత్రియులం కాకున్నా జీవితమనే రణరంగంలో పరిస్థితులతో యుద్ధం సాగిస్తూనే ఉంటాము. అలా సాగిస్తున్నప్పు డిది కూడా నేను చేస్తున్నాననే కర్తృత్వ బుద్ధి పెట్టు కోకుండా చేస్తూ పోవాలని సమన్వయించు కోవాలి మనమంతా. అప్పుడది దోషం క్రిందికి రాదు. అప్పుడు మనమూ ఒక విధంగా క్షత్రియులమే అవుతాము. క్షతాత్రాయతే ఇతి క్షత్రియః క్షతమంటే దెబ్బ - క్షతం నుంచి కాపాడేవాడు క్షత్రియుడు. ప్రజలకు దెబ్బ తగలకుండా రాజులు చూడవలసి ఉంటే మనమూ కర్మఫల దోషమనే దెబ్బ తగలకుండా జీవితాన్ని కాపాడుకొన్న వాళ్ల మవుతామని భావం.

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ || 32 ||

  అంతేకాదు. యుద్ధం చేసి నలుగురి ప్రాణాలు తీస్తే పాతకం వస్తుందని గదా బాధపడుతున్నావు. పాతకం రాకపోగా దానివల్ల మరి ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నావు. కాబట్టి శ్రేయస్సే కలుగుతుంది నీకు. ఎలాంటి దాశ్రేయస్సు. చెబుతున్నాడు. స్వర్గ ద్వార మపావృతం. స్వర్గ ద్వారాలు తెరచి ఉంచుతారు నీ కోసం. ధర్మయుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం వస్తుందని కదా చెప్పారు ధర్మశాస్త్రంలో. కనుక భయం లేదు. స్వర్గమే లభిస్తుంది నీకు. యదృచ్ఛయా చోపపన్నం అది కూడా యదృచ్ఛయా అప్రయత్నంగానే లభ్యమవుతుంది. నేను హామీ ఇస్తున్నానంటాడు పరమాత్మ.

Page 116

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు