సాంఖ్య యోగము
భగవద్గీత
స్వధర్మ మపిచా వేక్ష్యన వికంపితు మర్హసి. కారణమేమంటే యుద్ధం చేయటమూ ఆ యుద్ధంలో పదిమంది శత్రువులను నీవు వధించట మనేది నీ స్వధర్మం. ఎవడి ధర్మం వాడు నిర్వర్తించటంలో తప్పు లేదు. నిర్వర్తించక పోతేనే తప్పు. పైగా ఎప్పుడూ చేయమనటం లేదు. నిష్కారణంగా చేయమనటం లేదు యుద్ధం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలి క్షత్రియుడనే వాడు. అది వాడి కర్తవ్యం. నా విష్ణుః పృధివీ పతిః అన్నారు. విష్ణ్వంశతో పుట్టాడు క్షత్రియుడు. విష్ణువెలా దుష్టులను శిక్షించటాని కవతరిస్తుంటాడో అలాగే జన్మించాడు క్షత్రియుడు దుష్టశిక్షణ చేయటానికి. అలా కాకుంటే దేశాన్ని కాపాడలేడు. ప్రజలకు శాంతి సౌఖ్యాలు లేకుండాపోతాయి. అది మహాపాపం.
ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయాన్యత్ - క్షత్రియస్య నవిద్యతే. అంచేత యుద్ధం చేస్తే దోషమని భావించరాదు. నిర్నిమిత్తంగా ఎప్పుడు బడితే అప్పుడు తన స్వార్ధం కోసం చేస్తే దోషం. అలా కాక ధర్మాన్ని నిలబెట్టటం కోసమని ధార్మికమైన యుద్ధం చేస్తే అంతకన్నా క్షత్రియుడైన వాడికి శ్రేయస్సు లేదు. తనకూ తన ప్రజలకూ కూడా మంచి కలిగిస్తుందది. ఒక జడ్జీ ఉరిశిక్ష వేస్తాడొక నేరస్థుడికి. అయ్యో వీణ్ణి ఉరి తీస్తే ఆ పాతకం నాకు చుట్టుకొంటుందే అని భయపడతాడా బాధపడతాడా. అది తన కోసమంటూ చేయలేదతడు. అలాగే నీ కోసమని నీవు చేయటం లేదు. కనుక పాపకార్యం కాదది.
Page 115