ఆకాశంలో సూర్యమండల మిప్పుడు ప్రకాశిస్తున్నది. అది సాయంకాల మయ్యే సరికి అస్తమిస్తుంది. కంటికి కనపడకుండా పోతున్నది. అది మనం మరణమనుకొంటే ఎలాగా. మనకు కనిపించకున్నా మరొక దేశవాసులకు గోచరిస్తుంటుంది. తెల్లవారితే మరలా మనకే దృగ్గోచరమవుతుంది. అప్పుడది క్రొత్తగా ఉదయించిం దనుకొంటే ఎలాగా. ఉదయాస్తమయా లనగూడదు వీటిని. వ్యక్తావ్యక్తా లనాలి. అవ్యక్తంగా ఉందది మొదట. అదే వ్యక్తమయి గోచరించింది. మరలా అవ్యక్తంగా మారిపోతున్నది. మూడు దశలలో ఉండటమేమో ఉంది. ఎప్పుడూ లేకుండా పోలేదు. అయితే ఆద్యంతాలలో కనపడకుండా ఉంది. అదే అవ్యక్తం. మధ్యలో కనపడుతూ ఉంది. అదే వ్యక్తం. అవ్యక్తాదీని భూతాని - వ్యక్తమధ్యాని భారత - అవ్యక్త నిధనాన్యేవ - అని భగవద్గీత చాటిన మాటలలోని అంతరార్థమిదే.
ఇదుగో ఈ వ్యక్తావ్యక్తాలనే జనన మరణాలని మనం వ్యవహరిస్తున్నాము. ఒక జీవి జన్మాంచాడంటే వాడంతకుముందు ఎక్కడా లేక అప్పుటికప్పుడు ఆవిర్భవించాడని కాదు. అలాగే మరణించా డంటున్నా మంటే ఎక్కడా లేకుండా సర్వనాశనమై పోతున్నాడని కాదు. అంతకు ముందు అసలే లేని ఆ జీవి ఎలా వచ్చాడు. ఉన్నాడప్పుడూ. అయితే అతి సూక్ష్మంగా ఉన్నాడు. అలాగే పోయాడంటే మరలా ఆ సూక్ష్మావస్థలోనే ఉన్నాడను కోవాలి మనం. అంతేగాని అసలే లేకపోవడం కాదు. జీవాపేతం వావ కిలేదం మ్రియతే - నజీవో మ్రియతే అని ఉపనిషద్వాణి, జీవుడు నిష్క్రమిస్తే శరీరం మరణిస్తున్నదే గాని జీవుడు కాదట మరణించటం.
జీవుడే మరణించడం లేదంటే ఇక ఆత్మ ఎలా మరణించగలదు. మనస్సు ప్రాణమనే ఉపాధులతో చేయి కలిపిన చైతన్యమే జీవుడంటే.
Page 94