మనసు జ్ఞానశక్తి ప్రాణం క్రియాశక్తి. జ్ఞానమే చిత్తు ప్రాణమే సత్తు. ఇవి రెండే జీవుడనే గణపతి. దీనికి ద్యోతకంగానే శివాలయంలో శివలింగమూ పానవట్టమూ నిర్మించారు మన ప్రాచీనులు. పానవట్టం మీద లింగ ముందంటే మన దేహమనే దేవాలయంలో కూడ ప్రాణం మీద ఆధారపడే మనస్సుందని సంకేతం. ఇవి ఈ దేహం మేరకే పరిమితం చేసుకొని చూస్తున్నామిప్పుడు. ఇలాంటి చూపు ఉన్నంతవరకు మరణం తప్పదు మనకు. అంటే శవమైపోతాడే కాని మానవుడు శివమైన అమృతత్త్వాన్ని అందుకోలేడు. మరి వీడే పరిమితమైన ఈ గాణపత్యానికి స్వస్తి చెప్పి చూడ గలిగితే అవి రెండూ సచ్చి ద్రూపంగా పరిపూర్ణమై కనిపిస్తాయి. అప్పుడు అవి రెండు గావు అర్ధనారీశ్వరంగా ఒక్కటే తత్త్వం. శివశక్యైక్య రూపం. నామరూపాత్మకమైన ఈ విఘ్నయంత్రాన్ని ఛేదించి పోగలిగిన మహా గణేశునికే అది సిద్ధిస్తుంది. మహాబుద్ధితో దర్శించి అలాంటి మహా సిద్ధిని పొందాలి ఈ జీవుడనే గణేశుడు.
అది మనకు సాధన వల్ల సిద్ధించేదైతే ఆయనకు నిత్య సిద్ధం. తనకు భిన పైన సంసారాన్నంతా లయం చేసుకున్నది గనుక అది సచ్చి ద్రూపమే గాక ఆనంద రూపం గూడా. ఆనంద పారవశ్యంతో చేసేదే తాండవం. ఆనంద తాండవం. శివమైనదా తాండవం. శివ తాండవం. ఎక్కడ చూపుతాడా తాండవం. శ్మశానంలో. అంతా లయమైతే అది మహాశ్మశానం. కాశీకి మహాశ్మశానమని పేరు. అంతా లయమైనా తాను ప్రకాశిస్తూనే ఉన్నాడు. కాబట్టి అదే కాశీ కూడ అయింది. కాశి అంటే ప్రకాశించటమే. ఏమి చాటుతున్నది మనకీ సంకేతం. మీలోనూ ఉన్నదీ కాశి. మీ జ్ఞాన ప్రకాశం. మీలోనూ ఉన్నదా శ్మశానం. ప్రతిక్షణమూ పుడుతూ గిడుతూ ఉన్న మీరు చూచే ఈ ఉపాధి వర్గం. అది మీ శరీరమే కావచ్చు.
Page 85