శివలీలా వైభవము
బ్రహ్మ - విష్ణు శివ ఈ ముగ్గురు దేవతలనూ త్రిమూర్తులని పేర్కొంటాయి మన పురాణాలు. మూర్తి అంటే ఆకారం. నిరాకారమైన పరమాత్మ తత్త్వ మొక్కటే. అది మూడు ఆకారాలను ధరించి ముగ్గురు దేవత లయింది. సృష్టి చేయవలసి వచ్చి బ్రహ్మ అయింది. స్థితిని కాపాడవలసి విష్ణు వయింది. అలాగే దీని నంతటినీ లయం చేయవలసి శివుడయింది. అప్పటికి లయానికి సంకేతమే శివ తత్త్వం. నామరూప క్రియాత్మకంగా భాసించే చరాచర పదార్థాలన్నీ లయమయితే ఇక మిగిలే దేమిటి ? ఏది లయం చేసుకొన్నదో అది. ఇందులో లయమైనది శవమైతే లయకర్త ఇక శివం కాక తప్పదు. “ న భూమిర్నతోయం నతేజో నవాయుః” అని సృష్టి అంతా నశించినా సృష్టి కాధారమైన ఏ మూలతత్త్వ ముందో అది నశించదు. నశిస్తే శవం నశించకుంటే శివం. నశించే దానికి సాక్షి గనుక అది శివమే ఎప్పటికీ.
ఇలాంటి సాక్షి నీలో నాలో కూడ ఉన్నదిప్పుడు. అదే మన ఈ శరీరాన్ని దీని చుట్టూ పరచుకొని ఉన్న ఈ ప్రపంచాన్ని నిత్యమూ గమనిస్తున్న మన జ్ఞానం. దీనికే 'చిత్' అని పేరు వేదాంతంలో. తానుండి గదా దేనినైనా గమనించ వలసింది. ఈ ఉండటానికే 'సత్' అని పేరు. అయితే ఈ మూడు మూరల జానెడు శరీరానికే పరిమితమై కనిపిస్తున్నవీ రెండూ మనకిప్పుడు. మనః ప్రాణేంద్రియాత్మకమైన ఈ సంఘాతానికి గణమని వ్యవహారం. గణానికి పతినని భావిస్తున్నాము కాబట్టి గణపతులము మనమంతా. ఇవి ప్రమధ గణాలు. నిత్యమూ మధిస్తూ మనలనీ సంసారం నుంచి పైకెదిగి చూడనీయటం లేదు. ఎదిగి చూస్తే కాని పరిమితమైన ఈ సచ్చిత్తులు పరిపూర్ణంగా దర్శనమివ్వవు. పరిపూర్ణమైన 'సత్ చిత్'ల సమాహారమే శివ స్వరూపం.
Page 83