#


Index

  ఏమిటీ కథలోని అంతరార్థం. శివుడు సర్వజ్ఞుడు. పరిపూర్ణమైన జ్ఞానానికి సంకేతం. అలాంటి జ్ఞానశక్తి నడ్డుకున్నాడు వినాయకుడు. జ్ఞాన మక్కర లేదంటే ఇక మనకు మిగిలేదేమిటి ? గజముఖమే. గజ మజ్ఞానానికి చిహ్నం. రజస్తమో గుణాలు తప్ప శుద్ధసత్త్వాని కక్కడచోటు లేదు. తన్మూలంగా గణంతో సాంగత్య మేర్పడి గణపతి అయ్యాడు వినాయకుడు. గణమంటే ప్రమథ గణమని చెప్పాము. అది ఏదోగాదీ చరాచరప్రపంచమే. నిరంతరమూ మానవుడి తను మనఃప్రాణాలను మథించేది ఇదే. భూతప్రేత పిశాచాలివే. నామరూపాలే మనపాలిటికి. ఆధ్యాత్మికాది సంసార తాపాలన్నీ దీని మూలంగానే ప్రాప్తిస్తున్నాయి మనకు. మేమిచ్చిన జ్ఞానక్రియా శక్తుల బలంతో వీటిని వశం చేసుకొని గణపతివై కార్యసిద్ధి పడయమని మేము పంపితే చివరకు నీవా శ్రీ కోలుపోయి గణంతో చేతులు కలిపి బలహీనుడవై పోయావా అని వాపోయారా శివశక్తులు.

  తల్లిదండ్రుల వాత్సల్యానికి దూరమై ఈ తనయుడు మూలాధారమైన పృథివీ తత్త్వం దాకా పడిపోయాడు. పార్థివమైన రూపమే తన రూపమని భావించాడు. ఒక మూషికంలాగా చాపల్యానికి గురిఅయి భౌమమైన ఆలోచనలతోనే కడుపు నింపుకుంటూ ఊర్ధ్వముఖంగా చూడవలసిన తన చూపు నధోముఖం చేసుకొని రాజస, తామస గుణాలనే గణాలతోనే అనుక్షణమూ కాలక్షేపం చేయసాగాడు. దీనితో సవిఘ్నంగా గాక నిర్విఘ్నంగా ఎలా సాగుతుంది మానవుడి జీవయాత్ర. పాంచ భౌతికమైన గణంతో చేతులు కలిపిన నేరానికి తజ్జన్యమైన తాపత్రయ మనుభవించ వలసిందే. తప్పదు. అది తప్పాలంటే గణపతి నిజమైన గణపతే కావాలి.

Page 76