అది కేవలమూ జడమైన శక్తి సాధించలేదు. అందుకే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా. ఆయన కామేశ్వరుడు. ఆవిడ కామేశ్వరి. ఇరువురికీ ఇచ్చ కలిగి యీవిడ ఆయన ముఖాన్ని ఆలోకిస్తూ ఆ ఆలోకన ప్రభావంతో కల్పించిందట గణేశ్వరుణ్ణి, ఆలోకమంటే దర్శనమే కాదు. దీప్తి కూడా. అదే అమ్మవారి దర్శన క్రియగా మారి గణపతి తయారయ్యాడు. జ్ఞాన, క్రియా, శక్తులు రెండూ సంగమించిన పవిత్ర తీర్థమే ఆయన మూర్తి. అదే జగజ్జననీ జనకు లాయనలో కల్పించిన శ్రీ. దానితో శ్రీ మహాగణపతి అయ్యాడాయన. అది చూచి వరించారా బ్రహ్మచారి నిద్దరుకన్యలు. ఒకటి బుద్ధి మరొకటి సిద్ధి. బుద్ధి జ్ఞానానికి సిద్ధి క్రియాశక్తికి కేవలం ప్రతీకలే. అవి ఆ మహానుభావుడి వశంలో ఉంటాయి కాబట్టి భార్యలుగా భావించారు మన పెద్దలాయనకు.
మొత్తానికి వినాయకుడు గణేశ్వరు డయ్యాడు. ఈ గాణా పత్య మాయనకు పురాణదంపతులే ప్రసాదించారు. తల్లి దండ్రులలో తండ్రి జ్ఞాన రూపమైన బుద్ధినిస్తే- తల్లి క్రియారూపమైన సిద్ధి నిచ్చింది. ఈ జ్ఞాన క్రియాశక్తుల బలంతో ప్రమథ గణాల సదుపులో పెట్టుకొని గణపతి అయ్యాడు. వినయం చేసి వాటిని వినాయకు డయ్యాడు. వినాయకుడి జన్మ వృత్తాంతం పురాణాలు చెపుతుంటే చాలా చిత్రంగా తోస్తుంది. పార్వతీదేవి స్నానానికి వెళుతూ ఎవరూలోనికి రాకుండా చూడమని వినాయకుణ్ణి గుమ్మంలో కాపలా ఉంచిందట. అప్పుడే పరమేశ్వరుడు ఎక్కడి నుంచో బొట్టు పెట్టినట్టు అక్కడికి బయలుదేరి వస్తాడు. లోపలికి రాబోతుంటే బాలుడడ్డు పడతాడు. అందుకు కోపించి శివుడా బాలుని తల ఖండిస్తాడు. తరువాత అది తెలిసి పార్వతి దుఃఖిస్తే చూడలేక ఒక ఏనుగు తల తెప్పించి కళేబరాని కతికిస్తే లేచి కూచుంటా డాబాలకుడు. అప్పటినుంచీ గజముఖుడని పేరు వచ్చింది గణపతి కని చెపుతారు పౌరాణికులు.
Page 75